Oct 19,2023 07:55
  •  కాల్‌డేటా పిటిషన్‌ను సవరించి తీసుకురావాలని ఎసిబి కోర్టు ఆదేశం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో :ఎపి ఫైబర్‌నెట్‌ కేసులో సిఐడి దాఖలు చేసిన పిటి వారెంట్‌ పిటిషన్‌పై విచారణను ఈ నెల 20కు ఎసిబి కోర్టు వాయిదా వేసింది. సిఐడి వేసిన పిటి వారెంట్‌పై టిడిపి అధినేత చంద్రబాబు నాయుడును బుధవారం ఎసిబి కోర్టులో వ్యక్తిగతంగా ప్రవేశపెట్టాల్సి వుంది. ఇదే కేసులో సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్‌ పిటిషన్‌పై విచారణను శుక్రవారానికి వాయిదా వేసిన నేపథ్యంలో సిఐడి దాఖలు చేసిన మెమోకు అనుగుణంగా పిటి వారెంట్‌పై విచారణ నిర్ణయాన్ని ఈ నెల 20కు ఎసిబి కోర్టు వాయిదా వేసింది.

  • కాల్‌డేటా పిటిషన్‌ను సవరించి దాఖలు చేయండి

చంద్రబాబు అరెస్టుకు ముందు ఆ తర్వాత రాష్ట్ర సిఐడి అధికారుల కాల్‌డేటా రికార్డును ఇవ్వాలని చంద్రబాబు తరుపున న్యాయవాదులు వేసిన పిటిషన్‌పై బుధవారం ఎసిబి కోర్టు విచారణ చేపట్టింది. పిటిషన్‌ను సవరించి దాఖలు చేయాలని చంద్రబాబు తరపు న్యాయవాదులకు ఎసిబి కోర్టు సూచించింది. లీగల్‌ ప్రొవిజన్‌ ప్రకారం పిటిషన్‌లోని అంశాల్ని ప్రస్తావించాలని సూచించింది. ఫైబర్‌నెట్‌ కేసులో పిటి వారెంట్‌, చంద్రబాబు హెల్త్‌ రిపోర్ట్‌, సిఐడి అధికారుల కాల్‌ డేటా రికార్టు ఈ మూడు కేసులను ఈ నెల 20కు ఎసిబి కోర్టు వాయిదా వేసింది.