Oct 19,2023 18:10

హైదరాబాద్‌: సరూర్‌నగర్‌లోని జీహెచ్‌ఎంసీ సర్కిల్‌ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ వ్యక్తి నుంచి రూ.1.50 లక్షలు లంచం తీసుకుంటుండగా హయత్‌నగర్‌ సర్కిల్‌ టౌన్‌ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఉమతో పాటు అదే విభాగంలో పనిచేస్తున్న పొరుగు సేవల ఉద్యోగి లక్ష్మణ్‌ను అవినీతిశాఖ అధికారులు రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కొద్దిరోజుల క్రితం గుర్రంగూడకు చెందిన సుధాకర్‌రెడ్డి తన ఇంటి నిర్మాణం కోసం హయత్‌నగర్‌ సర్కిల్‌ టౌన్‌ ప్లానింగ్‌ సూపర్‌వైజర్‌ ఉమను కలిశారు. అనుమతి కోసం ఉమ రూ.లక్షన్నర లంచంగా ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. లంచం ఇవ్వడానికి ఇష్టపడని బాధితుడు సుధాకర్‌రెడ్డి ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ముందస్తుగా వేసుకున్న ప్రణాళిక ప్రకారం గురువారం బాధితుడి నుంచి ఉమ, లక్ష్మణ్‌ డబ్బులు తీసుకుంటుండగా పట్టుకున్నామని ఏసీబీ డీఎస్పీ మాజిద్‌ అలీ తెలిపారు.