Oct 27,2023 16:42

అమరావతి: నవంబర్‌ 1న రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు జీఏడీ ప్రిన్సిపల్‌ సెక్రెటరీ ముత్యాల రాజు శుక్రవారం ఆదేశాలు ఇచ్చారు. తాడేపల్లి క్యాంప్‌ కార్యాలయంలో నవంబర్‌ 1న ఉదయం 10 గంటలకు అమరజీవి పొట్టి శ్రీరాములుకు ముఖ్యమంత్రి జగన్‌ నివాళులర్పించనున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గవర్నర్‌, ముఖ్యమంత్రి తమ సందేశాలను అందజేయనున్నారు. జిల్లా స్థాయిలో అవతరణ దినోత్సవాన్ని నిర్వహించేందుకు కలెక్టర్లు, ఎస్పీలు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అటు ఢిల్లీలోని ఏపీ భవన్‌లో కూడా అవతరణ దినోత్సవం నిర్వహించాలని నిర్ణయించారు. అవతరణ దినోత్సవానికి ఏర్పాట్లు చేయాలంటూ సంబంధిత శాఖ అధికారులకు ఆదేశాలు జారీ అయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో అవతరణ దినోత్సవానికి మారుగా అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నవనిర్మాణ దీక్షలు చేపట్టిన విషయం తెలిసిందే. రాష్ట్రాన్ని అన్యాయంగా విభజించినందున ప్రతి ఒక్కరూ రాష్ట్ర నవనిర్మాణానికి పూనుకోవాలంటూ దీక్షల్లో విజ్ఞప్తి చేశారు.