Jan 03,2023 11:06

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వివిధ కళలను ప్రోత్సహించేందుకు నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఆధ్వర్యాన ఈ నెల 3నుంచి 12వరకు 5వ నాబార్డు క్రాప్ట్‌మేళా - 2023ను విజయవాడ మేరీ స్టెల్లా ఇండోర్‌ స్టేడియం, పంట కాలువ రోడ్డు, ఎన్‌టిఆర్‌ విగ్రహం సమీపంలో నిర్వహిస్తా మని నాబార్డు ప్రాంతీయ కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. క్రాప్ట్‌మేళాను రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజని ప్రారంభిస్తారని తెలిపింది. 3న మధ్యాహ్నం 3.30 గంటలకు పొందూరు, వెంకటగిరి, మంగళగిరి, పోచంపల్లి, మహేశ్వరి, కలంకారి చేనేత వస్త్రాల అమ్మకాల కోసం ప్రదర్శనకు పెడుతున్నట్లు పేర్కొంది. కొండపల్లి, ఏటికొప్పాక, తిరుపతి చెక్క బొమ్మలు, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ, చత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల నుంచి గాజు ఉత్పత్తులు, లెదర్‌ తోలుబొమ్మలు, జనపనార సంచులు, ఆభరణాలు, అలంకారానికి సంబంధించిన ఉత్పత్తులను ప్రదర్శిస్తారని తెలిపారు.