ప్రజాశక్తి-ఆత్మకూరు (అనంతపురం) : ఆత్మకూరు మండల కేంద్రంలో మంగళవారం ఆరోగ్య కేంద్రం వద్ద ఆశా కార్యకర్తలకు, ఏఎన్ఎమ్లకు ఆశా డే సమావేశం నిర్వహించడం జరిగింది. వ్యాధినిరోధక టీకాల కార్యక్రమంలో 11 రకాల వ్యాధులకు ఇచ్చే టీకాల గురించి, హై రిస్క్ గర్భిణీ స్త్రీలను గుర్తించి, వారిని ఆసుపత్రి ప్రసవాలకు ప్రోత్సహించడం, వారిని తల్లిబిడ్డ ఎక్స్ ప్రెస్ వాహనాల ద్వారా ఆసుపత్రికి తరలించాలని, ప్రతి ఆశా వారికి కేటాయించిన ఈ ఆశా యాప్ ద్వారా, గర్భిణీ సేవలు, ప్రసవానంతర సేవలు, అంగన్వాడీ కేంద్రంలో, పాఠశాలల్లో ఇచ్చే ఐరన్ మాత్రలు, సిరప్, విటమిన్ ఎ ద్రావణం పంపిణీ సేవలను అందులో నమోదు చేయాలని తెలిపారు. ఈరోజు ముఖ్యంగా 38 వ జాతీయ నేత్రదాన పక్షోత్సవాలలో భాగంగా వైఎస్ఆర్ కంటివెలుగు కార్యక్రమం కింద మండల వ్యాప్తంగా స్క్రీనింగ్ చేసిన 580 మందికి కంటి అద్దాలు పంపిణీ చేశారు. మరికొందరికి కంటి శస్త్ర చికిత్స నిమిత్తం జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ కార్యక్రమంలో వైద్యులు దయాకర్, సబిహా సుల్తానా, ఎంపిహెచ్ఈఓ లు నాగేశ్వరయ్య, మునాఫ్, సీహెచ్ ఓ శమీమ్ తార, పీహెచ్ ఎన్.తులసమ్మ, కంటి నిపుణుడు బాల వెంకటరమణ, ఏఎన్ ఎమ్ లు, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్లు, ఆశా కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.










