అగర్తల : త్రిపుర ఉప ఎన్నికల ఓట్ల లెక్కింపును బహిష్కరిస్తున్నట్లు సిపిఎం పేర్కొంది. ఈ నెల 5న జరిగిన ఉప ఎన్నికల్లో రిగ్గింగ్ను అరికట్టేందుకు భారత ఎన్నికల సంఘం (ఇసి) ఎలాంటి చర్యలుచేపట్టలేదని ఆగ్రహం వ్యక్తం చేసింది. సెపాహిజాలా జిల్లాలోని బాక్సానరగ్, ధన్పూర్ అసెంబ్లీ స్థానాల్లో సగటున 86.5 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ సందర్భంగా పెద్ద ఎత్తున రిగ్గింగ్ జరిగిందని తెలిపింది.
'' పోలింగ్ ప్రారంభం నుండే ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లాం. కానీ రిగ్గింగ్ను అడ్డుకునేందుకు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విచారకరం'' అని సిపిఎం కన్వీనర్ నారాయణ్ కర్ బుధవారం రాత్రి పేర్కొన్నారు. ఎన్నికలను రద్దు చేసి మరోసారి పోలింగ్ను ప్రకటించాలని డిమాండ్ చేశామని, అయితే ఇసి నిరాకరించిందని అన్నారు. ఇసి ఉద్దేశ్యం చాలా స్పష్టంగా ఉంది. ఈ స్థితిలో సెప్టెంబర్ 8న జరగాల్సిన ఓట్లలెక్కింపులో పాల్గనడం అనవసరం. దీంతో కౌంటింగ్ను బహిష్కరిస్తున్నామని అన్నారు.










