
- ఫిబ్రవరి వచ్చినా సాగని సేద్యం
- పది లక్షల ఎకరాల్లో తగ్గుదల
- ఇంకా నెలే సమయం
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ సారి రబీ అస్తుబిస్తుగా సాగుతోంది. జనవరి వెళ్లి ఫిబ్రవరి వచ్చినా పంటల సాగులో అంతగా పురోగతి కనిపించట్లేదు. ఇప్పటికి కావాల్సిన సాగులో పది లక్షల ఎకరాలకుపైన తగ్గుదల కనిపిస్తోంది. నిరుడు ఈపాటికి సాగైన దాని కంటే ఎనిమిది లక్షల ఎకరాలకు పైన లోటు నెలకొంది. రబీ సీజన్కు ఇంకా గట్టిగా నెల రోజులే సమయముంది. ఈ వ్యవధిలో సాధారణ సాగును చేరాలంటే ఇంకా పదహారున్నర లక్షల ఎకరాల్లో పంటలు వేయాలి. మార్చి రెండో వారం వరకు నీటి వసతి ఉన్న చోట మాత్రం వరి నాట్లు వేస్తారు. మిగతా పంటలన్నీ దాదాపు ఫిబ్రవరిలోనే సాగు చేస్తారు. ఈ పరిస్థితులను బేరీజు వేసుకుంటే ఈ మారు రబీ సాగు బాగా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
నీటి వసతి ఉన్నా...
ఈ తడవ రబీలో 58 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. సీజన్ సాధారణ సాగు 57.30 లక్షల ఎకరాలు. జనవరి ఆఖరికి 51.45 లక్షల ఎకరాల్లో సాగు కావాల్సి ఉండగా 40.75 లక్షల ఎకరాల్లోనే (79 శాతం) సాగు నమోదైంది. నార్మల్ కంటే 10.7 లక్షల ఎకరాల్లో (21 శాతం) సాగు తగ్గింది. ఈ సమయానికి నిరుడు 49 లక్షల ఎకరాల్లో పంటలు వేశారు. గతేడాది కంటే ఈ ఏట 8.27 లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ప్రాజెక్టుల్లో నీరు, భూగర్భ జలాలు ఆశాజనకంగా ఉన్నప్పటికీ రబీ సేద్యం సాగట్లేదు. బోర్లు, కొన్ని ప్రాజెక్టుల కింద వరిపై ప్రభుత్వం నియంత్రణ అమలు చేయడం, ఉత్పాదకాల ధరల పెరుగుదల కూడా సాగు తగ్గడానికి కారణాలుగా చెబుతున్నారు.
- ఆహార ధాన్యాలు సైతం
ఆహార ధాన్యాలు ఇప్పటికి కావాల్సిన సాగు కంటే 10.37 లక్షల ఎకరాల్లో (22 శాతం) తగ్గాయి. నిరుటి కంటే 8.3 లక్షల ఎకరాల్లో తగ్గాయి. ప్రధానంగా వరి 3.15 లక్షల ఎకరాల్లో (19 శాతం) తగ్గింది. గతేడాది కంటే 3 లక్షల ఎకరాల్లో తగ్గింది. రబీలో వరి కంటే ఎక్కువ పప్పుధాన్యాలు సాగవుతాయి. ఈ తడవ వాటి సాగు కూడా 2.4 లక్షల ఎకరాల్లో (26 శాతం) తగ్గాయి. పప్పుల్లో శనగ సాగు ఎక్కువ. ఈపాటికి శనగ సాగు దాదాపు పూర్తి కావాలి. కానీ 73 శాతమే సాగైంది. మినుములు 82 శాతం, పెసలు 82 శాతమే సాగయ్యాయి.
ముతకధాన్యాల సాగు లక్ష ఎకరాల్లో తగ్గింది. మొత్తమ్మీద మొక్కజొన్న ఒక్కటే పర్వాలేదనిపిస్తోంది. రబీలో నూనెగింజల సాగు తక్కువ కాగా వాటి సాగు కూడా అతంతమాత్రంగానే ఉంది.
- చిత్తూరులో తక్కువ... సత్యసాయిలో ఎక్కువ
చిత్తూరు జిల్లాలో రబీలో రాష్ట్రంలోనే తక్కువ సాగు నమోదైంది. అక్కడ 43 శాతమే పంటలు సాగయ్యాయి. సత్యసాయి జిల్లాలో అత్యధికంగా 105 శాతం పంటలు వేశారు. తతిమ్మా జిల్లాల్లో 50 నుంచి 83 శాతం మధ్య సాగు నమోదైంది.
