
- జనవరి వచ్చినా సగమే సాగు
- తొమ్మిదిన్నర లక్షల ఎకరాల్లో తక్కువ
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఈ తడవ రబీ సాగు జనవరి వచ్చినా పుంజుకోలేదు. అక్టోబర్లో సీజన్ మొదలుకాగా ఇప్పటికి మూడు మాసాలు గడిచిపోయాయి. అయినా సాగు బాగా నెమ్మదిగా సాగుతోంది. సాధారణ విస్తీర్ణంలో సగమే సాగు నమోదైంది. ఈపాటికి కావాల్సిన సాగులో తొమ్మిదిన్నర లక్షల ఎకరాల్లో సాగు తగ్గింది. ఆహార ధాన్యాలు సైతం సగమే సాగయ్యాయి. ఆ పంటలు కూడా ఇప్పటికి కావాల్సిన సాగులో 9 లక్షల ఎకరాలు తగ్గాయి. జనవరి 4 నాటికి వ్యవసాయ శాఖ విడుదల చేసిన అధికారిక గణాంకాలివి. క్షేత్ర స్థాయిలో సేద్యం ఇంకా తక్కువే జరిగిందని చెబుతున్నారు. రబీలో వరి, పప్పుధాన్యాల సాగు 70 శాతంపైనే. ఆ పంటలు సైతం తక్కువే సాగయ్యాయి. వరి నాట్లు 35 శాతం విస్తీర్ణంలో వేశారు. నిరుటి వలేనే ఈ ఏడాది కూడా రబీలో వరి సాగుపై ప్రభుత్వం ఆంక్షలు విధించింది. మోటార్లు, లిఫ్టులు, బావుల కింద వరి వేయొద్దని ఆదేశించింది.
కృష్ణా డెల్టాలో రెండవ పంటకు నీరివ్వట్లేదు. ప్రత్యామ్నాయ పంటలు సాగు చేయమంటున్నారు. దాంతో వరి సాధారణ విస్తీర్ణం తగ్గింది. ప్రస్తుతానికి పెన్నా, గోదావరి కాల్వల కిందనే వరి సాగుకు అనుమతి ఉంది. నెల్లూరు జిల్లాలో వరి సాగు విస్తీర్ణం రాష్ట్రంలోనే అత్యధికం. అక్కడ కూడా ఈ సారి 69 శాతమే నాట్లు పడ్డాయి. పశ్చిమగోదావరి, కోనసీమ, కాకినాడ, తిరుపతి, నంద్యాలలో వరి నాట్లు తక్కువే పడ్డాయి.
పప్పు ధాన్యాలూ అంతే
రబీలో వరి కంటే పప్పుధాన్యాల సాగే ఎక్కువ. అందులోనూ శనగ విస్తీర్ణం అత్యధికం. మొత్తంగా పప్పుధాన్యాలు 65 శాతం సాగయ్యాయి. శనగ 71 శాతం సాగైంది. కడప, అనంతపురం, కర్నూలు, నంద్యాల, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, పల్నాడులో ఒక మేరకు సాగు చేస్తారు. అన్ని చోట్లా నార్మల్ కంటే తక్కువే సాగైంది. ఈపాటికి శనగ పంట సాగు దాదాపు పూర్తవుతుంది. కానీ ఈ సంవత్సరం ఆ పరిస్థతి లేదు. వరికి ప్రత్యామ్నాయంగా కృష్ణా డెల్టాలో మినుము, పెసర్లు సాగు చేస్తారు. ఆ పంటలు సైతం పూర్తి స్థాయిలో సాగు కాలేదు. నంద్యాల, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, శ్రీకాకుళం, విజయనగరంలోనూ మినుము తక్కువే సాగైంది. పెసర ఎక్కువగా సాగయ్యే గుంటూరు, బాపట్ల, పల్నాడు, శ్రీకాకుళం, విజయనగరంలో నార్మల్ కంటే తక్కువ సాగైంది.
నూనెగింజలు సైతం..
మామూలుగా రబీలో నూనెగింజల సాగు తక్కువ. ఆ మేరకు పంటలు సైతం తగ్గాయి. వచ్చే ఖరీఫ్ విత్తన అవసరాల కోసం రబీలో వేరుశనగ పండిస్తారు. ఈ తడవ విత్తన పంట కూడా తగ్గింది. మొత్తమ్మీద నూనెగింజలు 53 శాతం విస్తీర్ణంలోనే సాగయ్యాయి. పొగాకు 68 శాతం సాగైంది.
