
రాంచీ : గిరిజనుల నాయకులు బిర్సా ముండా జయంతి సందర్భంగా జార్ఖండ్లో ప్రధానమంత్రి నరేంద్రమోడీ పర్యటించారు. ప్రధానమంత్రి ప్రత్యేక బలహీన గిరిజన సమూహాలు (పిఎం పివిటిజి) మిషన్ కింద సుమారు రూ.24 వేల కోట్ల ప్రాజెక్టులను మోడీ బుధవారం ప్రారంభించారు. ఖుంటి జిల్లాలోని బిర్సా కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో దాదాపు ఎనిమిది కోట్ల మంది లబ్ధిదారులకు పిఎం కిసాన్ పథకం కింద 15వ విడతగా రూ.18 వేల కోట్లను ప్రధాని విడుదల చేశారు. అంతకుముందు రాంచీలోని బిర్సా ముండా మ్యూజియాన్ని మోడీ సందర్శించారు. బిర్సా ముండా జన్మస్థలం ఉలిహతుకు వెళ్లి, ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ పర్యటనలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్, గవర్నర్ సిపి రాధాకృష్ణన్, కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ మంత్రి అర్జున్ ముండా తదితరులు ఉన్నారు.