Dec 03,2022 21:17

అహ్మదాబాద్‌ : గుజరాత్‌ ఎన్నికల ప్రచార సరళిపై స్పందిస్తూ తాను చేసిన 'రావణ్‌' వ్యాఖ్యలను బిజెపి వక్రీకరిస్తోందని కాంగ్రెస్‌ అధినేత మల్లిఖార్జన ఖర్గే శనివారం అన్నారు. 'గుజరాత్‌ మోడల్‌' అంతా డొల్ల అని తేలిన నేపథ్యంలో బిజెపికి ఓట్లు అడిగేందుకు ఏమీ మిగలలేదని అందుకునే విధానాలు కాకుండా వ్యక్తిగత విద్వేషాలతో నానా పాట్లు పడుతోందని ఆయన విమర్శించారు. ఎన్నికల ప్రచారసభల్లో పదేపదే 'నన్ను చూడండి..నన్ను చూడండి' అంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఓటర్లను కోరడంపై స్పందిస్తూ 'మీకేమైనా రావణుడిలా పదో, వందో తలలున్నాయా?' అంటూ ఖర్గే ఎద్దేవా చేసిన సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలను మోడీ, బిజెపి నేతలు ద్వేషపూరిత వ్యాఖ్యలుగా పేర్కొంటూ ఓటర్ల ఎదుట వాపోతున్నారు. అయితే ఇది పెద్ద నాటకమని, దీనికంటే ప్రధానమైన సమస్యలను కావాలనే బిజెపి నేతలు, మోడీ విస్మరిస్తన్నారని ఖర్గే అన్నారు. తాము పనితీరు రాజకీయాలను నమ్ముతామని, కానీ బిజెపి అన్నింటా తానైవుంటున్న ఏక వ్యక్తి కేంద్రంగా నడిచే రాజకీయాలను నమ్ముతోందని ఖర్గే పేర్కొన్నారు. గుజరాత్‌లో ఆమాద్మీ పార్టీ పోటీపై ఆయన స్పందిస్తూ 'ఇదంతా కేవలం కాంగ్రెస్‌ ఓట్లను చీల్చేందుకే' అని తెలిపారు. 'రావణ్‌' వ్యాఖ్యలను బిజెపి వాళ్ల ఎన్నికల ప్రయోజనాల కోసం వక్రీకరిస్తున్నారని విమర్శించారు. 'మాకు రాజకీయాలంటే వ్యక్తిగతమైనవి కాదు. విధానపరమైనవి. బిజెపి వ్యక్తికేంద్ర విద్వేషాలపైనే ఆధారపడుతోంది' అని ఖర్గే తెలిపారు. ప్రధాని మోడీ శైలీ రాజకీయాల్లో ప్రజాస్వామ్య స్ఫూర్తి కొరవడుతోందని, దీనికి తాను చాలా ఉదంతాలు ఉదహరించగలనని తెలిపారు. పార్లమెంటరీ రాజకీయాల్లో తనకు 51 సంవత్సరాల అనుభవం ఉందనీ, తాను ఏనాడు వ్యక్తిగతమెది వ్యాఖ్యలు చేయనని, బిజెపిని కూడా తాను విమర్శలు గుప్పించింది. కేవలం అభివృద్ధికి సంబంధించిన అంశాలపైనే అని తెలిపారు. ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, పేదరికం వంటి సమస్యలకు పరిష్కారాలపై చర్చ జరగాలని, వ్యక్తిగతమైన అంశాలపై కాదని ఆయన తెలిపారు.