
న్యూఢిల్లీ : ఈ ఏడాది జరిగే తొమ్మిది రాష్ట్రాల ఎన్నికల్లో విజయం సాధించాలని బిజెపి అధ్యక్షుడు జెపి నడ్డా ఆ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 9 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, వచ్చే ఏడాది లోక్సభ ఎన్నికలకు వ్యూహాలను రూపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన సోమవారం ఇక్కడ ఎన్డిఎంసి కన్వెన్షన్ సెంటర్లో రెండు రోజుల బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు ప్రారంభమయ్యాయి. బిజెపి ఇప్పటివరకూ లక్షా 30 వేల పోలింగ్ బూత్లలో బలంగా ఉందని, బలహీనంగా ఉన్న 72 వేల పోలింగ్ బూత్లను బలోపేతం చేయాలని అన్నారు. ఈ సమావేశాలకు 35 మంది కేంద్ర మంత్రులు, 12 మంది సిఎంలు, ఐదుగురు డిప్యూటీ సిఎంలు, అన్ని రాష్ట్రాల బిజెపి అధ్యక్షులు సహా 350 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సమావేశానికి ముందు జాతీయస్థాయిలో ఆఫీసు బేరర్ల సమావేశం కూడా జరిగింది.
- మోడీ మెగా రోడ్ షో
ఈ సమావేశాలకు ముందు ప్రధాని మోడీ ఢిల్లీలో పెద్ద ఎత్తున రోడ్ షో నిర్వహించారు. పటేల్ చౌక్ నుంచి ప్రారంభమైన రోడ్ షో పొడవునా మోడీ భారీ కటౌట్లు కనిపించాయి. ప్రభుత్వం చేపట్టిన వివిధ పథకాల వివరాలను తెలియచేసేలా అనేక పోస్టర్లు వెలిశాయి. పలుచోట్ల వివిధ రాష్ట్రాల జానపద కళాకారులు తమ కళారూపాలను ప్రదర్శించారు.