- ఏడేళ్లలో రైల్వేకు రూ. 2800 కోట్లు ఆదాయం
న్యూఢిల్లీ : రైళ్లలో చిన్నారుల ప్రయాణానికి సంబంధించిన సవరించిన నిబంధనల కారణంగా భారతీయ రైల్వేకు రూ.2800 కోట్లు అదనపు ఆదాయం సమకూరింది. సవరించిన నిబంధనలు అమల్లోకి వచ్చి ఏడేళ్లు కాగా.. 2022-23 ఆర్థిక సంవత్సరంలో అత్యధికంగా రూ.560 కోట్లు వచ్చినట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఈ విషయం ఒక ఆర్టీఐ దరఖాస్తుకు రైల్వే శాఖ పరిధిలోని సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్స్ ఇచ్చిన సమాచారం ద్వారా వెల్లడయింది. రైళ్లలో ఒకప్పుడు 5-12 ఏళ్ల చిన్నారులకు సపరేట్ బెర్త్ ఎంచుకున్నా టికెట్ ధరలో సగం మాత్రమే వసూలు చేసేవారు. అయితే 2016 మార్చి 31న కొత్త నిబంధనలను రైల్వే శాఖ ప్రకటించింది. సపరేట్ బెర్త్/ సీటు ఎంచుకుంటే పెద్దల్లానే పిల్లలకూ పూర్తి టికెట్ ధర వర్తిస్తుందని తెలిపింది. ఒకవేళ సెపరేట్ బెర్త్ వద్దనుకుంటే హాఫ్ టికెట్ వర్తిస్తుంది. ఈ నిబంధనలు 2016 ఏప్రిల్ 21 నుంచి అమల్లోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 2016-17 నుంచి 2022-23 వరకు వివిధ ఆర్థిక సంవత్సరాల్లో రైల్వే శాఖ రూ 28 00 కోట్ల ఆదాయం సమకూరింది. గత ఏడేళ్లలో ఫుల్ ఫేర్ చెల్లించి సపరేట్ బెర్త్/ సీట్ను వినియోగించుకుని 10 కోట్ల మంది చిన్నారులు ప్రయాణించినట్లు రైల్వే శాఖ తెలిపింది. 3.6 కోట్ల మంది మాత్రమే హఫ్ టికెట్ ధర చెల్లించినట్లు పేర్కొంది. అంటే రైళ్లలో ప్రయాణించే చిన్నారుల్లో 70 శాతం మంది ఫుల్ టికెట్ చెల్లించే ప్రయాణిస్తున్నట్లు వెల్లడైందని ఆర్టీఐ కార్యకర్త చంద్రశేఖర్ గౌర్ పేర్కొన్నారు. దూర ప్రయాణాలు చేసే వారు సపరేట్ బెర్త్ వినియోగించుకుంటున్నారని, దీనివల్ల రైల్వేకు అదనపు ఆదాయం సమకూరిందని చెప్పారు.










