Jun 06,2023 12:18

భువనేశ్వర్‌  :   బాలాసోర్‌ రైలు ప్రమాదంలో ఇంకా 101 మృతదేహాలను గుర్తించాల్సి వుందని  అధికారులు తెలిపారు. సుమారు 200 మంది ఒడిషాలోని వివిధ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని మంగళవారం  తూర్పు మధ్య రైల్వే డివిజనల్‌ మేనేజర్‌ రింకేష్‌ రాయ్  తెలిపారు. సుమారు 1,100 మంది ఈ ప్రమాదంలో గాయపడగా, వారిలో సుమారు 900 చికిత్స అనంతరం డిశ్చార్జ్‌ అయినట్లు మీడియాకు వివరించారు. భువనేశ్వర్‌లో భద్రపరిచిన మొత్తం 193 మృతదేహాల్లో ఇప్పటివరకు 80 మృతదేహాలను గుర్తించామని, 55 మృతదేహాలను కుటుంబసభ్యులకు అప్పగించామని భువనేశ్వర్‌ మునిసిపల్‌ కార్పోరేషన్‌ (బిఎంసి) కమిషనర్‌ విజరు అమృత్‌ కులాంగే తెలిపారు. బిఎంసి హెల్ప్‌లైన్‌ నెంబర్‌ 1929కి 200కి పైగా ఫోన్‌కాల్స్‌ వచ్చాయని అన్నారు.