
దేశంలో మానవ హక్కులు రోజురోజుకి తీసికట్టుగా మారుతున్న తీరుకు ఐక్యరాజ్యసమితి తాజాగా వ్యక్తం చేసిన ఆందోళన అద్దం పడుతోంది. జి-20 సమావేశాలను ఘనంగా నిర్వహించామంటూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు అట్టహాసంగా ప్రచారం చేసుకుంటున్న వేళ ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలిలో ఈ పరిణామం చోటుచేసుకుంది. మండలి 52వ సమావేశం ప్రారంభమైన తొలి రోజే ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల చీఫ్ వోల్కర్ తుర్క్ మన దేశంలో నెలకొన్న పరిస్థితులను, ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణిని సుదీర్ఘంగా వివరించడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. ఐక్యరాజ్యసమితి మాత్రమే కాదు! జి-20 సమావేశాలలో పాల్గొని ఢిల్లీ నుండి వియత్నాం పర్యటనకు వెళ్లిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అక్కడ దిగీదిగగానే భారతదేశంలో పతనమౌతున్న మానవ హక్కుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. వియత్నాం పర్యటనలో బైడెన్ మాట్లాడుతూ జి-20 శిఖిరాగ్ర సదస్సు సందర్భంగా జరిగిన చర్చల్లో భారత ప్రధాని నరేంద్ర మోడీతో మానవ హక్కులను గౌరవించే అంశాన్ని లేవనెత్తినట్లు తెలిపారు. బైడెన్ తనంతట తానుగా ఈ విషయాలను వివరించడం ప్రాధాన్యత సంతరించుకుంది. బైడెన్ ఈ వ్యాఖ్యలు చేసిన కాసేపటికే మీడియాతో మాట్లాడిన వైట్హౌస్ అధికార ప్రతినిధి ఒకరు ఆరోగ్యవంతమైన ప్రజాస్వామ్య పరిరక్షణ ఆవశ్యకత గురించి మోడీతో బైడెన్ మాట్లాడినట్లు వివరించారు.
అమెరికా అధ్యక్షునితో పాటు వివిధ దేశాధినేతలతో జరిపిన చర్చలు ఫలప్రదమైనాయని మోడీ, ఆయన పరివారం ఘనంగా సాగించిన ప్రచారంలోని డొల్లతనం బైడెన్ వ్యాఖ్యలతో బట్టబయలైంది. నిజానికి ఈ ఏడాది ప్రారంభంలో విడుదల చేసిన '2022వ సంవత్సరలో వివిధ దేశాల్లో మానవ హక్కులు'పై విడుదల చేసిన నివేదికలో సైతం భారత్లో చోటుచేసుకుంటున్న పరిణామాలపై అమెరికా ఆందోళన వ్యక్తం చేసింది. మణిపూర్లో చోటుచేసుకున్న మారణకాండపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ యూరోపియన్ పార్లమెంటు జులై 13వ తేదిన ఒక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. మణిపూర్లో మానవ హక్కులను కాపాడటానికి కేంద్ర ప్రభుత్వం తక్షణం చర్యలు తీసుకోవాలని ఆ తీర్మానంలో కోరింది. ఆ తరువాత కూడా మణిపూర్లో విద్వేష మంటలు రగలుతూనే ఉన్నాయి. హ్యూమన్రైట్స్ వాచ్ 2022వ సంవత్సరానికి విడుదల చేసిన ప్రపంచ దేశాల నివేదికలో సైతం మన దేశంలో చోటు చేసుకుంటున్న పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ సహా దాదాపు అన్ని నివేదికలు మన దేశంలో మతోన్మాద దాడులు పెరగుతున్నాయని, అధికార యంత్రాంగం ఈ తరహా దాడుల పట్ల చూసీచూడనట్లు వ్యవహరిస్తోందని పేర్కొన్నాయి. ఈ నివేదికలు విడుదలైన తరువాత మణిపూర్, హర్యానా ఘటనలు చోటుచేసుకోవడం మరింత ఆందోళన కలిగించే అంశం! ఒకవైపు విశ్వగురువులమని చెప్పుకుంటూ మరోవైపు ఇతర దేశాల నుంచి సుద్దులు చెప్పించుకోవాల్సి రావడం ఎంత సిగ్గుచేటు! మిగిలిన విషయాలు ఎలా ఉన్నప్పటికీ లౌకికవాదం, మత సామరస్యం విషయంలో మన దేశానికి ప్రపంచ దేశాల్లో కొన్ని సంవత్సరాల క్రితం వరకు మంచి గుర్తింపే ఉంది. మోడీ నేతృత్వంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత దేశ ప్రతిష్టను మంటగలుపుతున్నారు. 'బిజెపి ప్రభుత్వాలు, సంఘపరివార్ మూకలు మైనార్టీలను లక్ష్యం చేసుకుని విద్వేష ప్రచారం చేస్తూ ఒక పథకం ప్రకారం దాడులు చేస్తున్నాయి. ఈ భావజాలాన్ని జాతీయ మానవ హక్కుల కమిషన్తో పాటు, న్యాయ వ్యవస్థలోకి చొప్పించడానికి ప్రయత్నిస్తుండటం ఆందోళనకరం' అని హ్యూమన్రైట్స్ వాచ్ పేర్కొంది. ఇంత స్పష్టంగా కాకపోయినా 'మతోన్మాదం, విద్వేష ప్రసంగాలు, అసహనం, వివక్ష వంటి పరిస్థితులను భారత ప్రభుత్వం మరింత సూటిగా, కఠినంగా ఎదుర్కోవాలి. మైనార్టీల హక్కుల పరిరక్షణ కోసం రెట్టింపు కృషిని చేయాలి' అని తాజాగా ఐక్యరాజ్యసమితి సూచించింది. రాజకీయ లబ్ధి కోసం విభజన వ్యూహాలను నడిపే మోడీ సర్కారు దీనిని పట్టించుకుంటుందా అన్నది అనుమానమే! మేధావులు, ప్రజాతంత్ర శక్తులు, లౌకిక వాదులు మరింత అప్రమత్తంగా, ఐక్యంగా ఉండాల్సిన సమయమిది!