
'యత్ర నార్యన్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా:' అంటారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు సంచరిస్తారని దీని అర్థం. ప్రకృతిని స్త్రీ రూపంగా చెబుతాయి వేదాలు. మాతృదేవోభవ అన్నారు పెద్దలు. స్త్రీని ఋగ్వేదం విశ్వశక్తి అని, ఉపనిషత్తులు సాధికారత కలిగిన శక్తి స్వరూపం అని అభివర్ణించాయి. పంచభూతాలలో భూమి, నీరు స్త్రీ స్వరూపంగా భావించి, భూ మాత, నదీ మతల్లి అని గౌరవాన్ని కట్టబెట్టారు. కానీ, వైదిక వాజ్ఞ్మయంలోనూ, పురాణేతిహాసాలలోనూ స్త్రీని కించపరిచే, అవమానపరచే అంశాలు అనేకం వున్నాయి. సీతను అపహరించిన రావణుడు, నిండు కొలువులో ద్రౌపదిని వస్త్రాపహరణం గావించిన దుర్యోధన దుశ్శాసనాదులు, సైరంధ్రి (ద్రౌపది)ని చెరపట్టిన కీచకుడు వంటి కిరాతకులు చాలామందే కనిపిస్తారు. అలాగే చరిత్రలోనూ రాజ్యాలతోపాటు రాణులనూ ఆక్రమించుకున్నవారున్నారు. అనంతర కాలంలో సతీసహగమనం, బాల్య వివాహాల వంటి దురాచారాలు, నిజాం రాజ్యంలో స్త్రీలను వివస్త్రలను గావించి, బతుకమ్మ ఆడించిన పైశాచికత్వం...భారతీయ యవనికపై మాయని మచ్చలు. 'ఈ దుర్యోధన దుశ్శాసన/ దుర్వినీత లోకంలో/ రక్తాశ్రులు చిందిస్తూ/ రాస్తున్నా శోకంతో/ మరో మహాభారతం ఆరవ వేదం/ మానభంగ పర్వంలో మణిపూర్ మహిళల/ మాతృహృదయ నిర్వేదం' అంటూ వేటూరి సజీవాక్షరాలకు, ఓ కవయిత్రి వేదనానభరిత ముక్తాయింపు. పురాణాలైనా, చరిత్రలోనైనా... మనుషుల పేర్లు, ఊరి పేర్లు మారినా... మారనిది మహిళల దుస్థితి. అప్పుడు, ఇప్పుడు బాధితురాలు మహిళే. కథలు, వ్యధలు, కన్నీళ్లు ఒక్కటే.
సున్నితమైన అలలు అలలుగా వుండే కొండలు, పచ్చదనం కప్పుకున్న లోయలు, ఆకాశాన్ని తనలో నింపినట్లుండే నీలి సరస్సులు, జలపాతాలు, దట్టమైన అడవులు, అందమైన మైదానాలతో ప్రకృతి పచ్చని పట్టువస్త్రం కప్పుకున్నట్లుండే ఆహ్లాదకరమైన రాష్ట్రం మణిపూర్. ఎప్పుడూ మృదువైన చల్లని గాలులు వీచే మణిపూర్లో ఇప్పుడు ఆక్రందనలు, శోకగీతాలు వినిపిస్తున్నాయి. అద్భుతమైన రంగురంగుల పూలతో అలరారే ఆ రాష్ట్ర తెల్లని జుకౌ లిల్లీ పువ్వు...తియ్యని మకరందానికి బదులుగా ఎర్రటి రక్తాన్ని స్రవిస్తున్నది. ఈ లిల్లీ పూలు స్రవిస్తున్న నెత్తుటికి కారకులెవరు? ధృతరాష్ట్రుని పాలనలో జాతుల మధ్య, మతాల మధ్య వైషమ్యాలు రెచ్చగొట్టి, అగ్గి రాజేసి, మహిళల నగ్న శరీరాలను ప్రదర్శనకు పెట్టిన ఆధునిక కీచక, దుర్యోధన దుశ్శాసనాదులు ఎవరు? గోసంరక్షకులమని, తమను తాము హిందూత్వ ప్రతినిధులమని చెప్పుకుంటున్నవారికి మణిపూర్ నగ్నత్వం బాధించలేదా? పైపెచ్చు 'అక్కడేం జరిగిందనీ...' అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం లేదా? గోవుల్లో దేవుడ్ని చూస్తున్నవారికి... మణిపూర్ ఆడపడుచుల ఆక్రందన కనబడకపోవడం శోచనీయం. మూడు నెలలు గడుస్తున్నా, వారి అభ్యర్థనలు, విజ్ఞాపనలు చెవికెక్కించుకోని ప్రధాని... దేశమంతా సిగ్గుపడాలి అంటున్నారు. నడిరోడ్డుపై స్త్రీలను వివస్త్రలను చేసి, అడ్డుకోబోయిన కుటుంబ సభ్యులను చంపి, అసహాయులను ఆధిపత్య హింసావాదులకు అప్పగించిన వారిని పల్లెత్తుమాట అనకపోగా...మౌనందాల్చిన వారు కదా ముందుగా సిగ్గుపడాలి.
ఇది ప్రమాదవశాత్తూ జరిగింది కాదని లోకజ్ఞానం వున్న ఎవరికైనా అర్థమౌతుంది. మణిపూర్ ఒక ప్రయోగశాల మాత్రమే. అక్కడి అడవులు, కొండల్లోని విలువైన ప్రకృతి వనరులను, సహజ సంపదను కార్పొరేట్లకు అప్పజెప్పడమే ఈ హింసలోని కుట్ర కోణం. 'కన్నులుండి చూడలేని/ ధృతరాష్ట్రుల పాలనలో/ భర్తలుండి విధవ అయిన/ ద్రౌపది ఆక్రందనలో/ నవశక్తులు యువశక్తులు/ నిర్వీర్యం అవుతుంటే/ ఏమైపోతుంది సభ్య సమాజం' అన్న వేటూరి ఆవేదన ఈ సమాజానికి కనువిప్పు కావాలి. 'ఈ యాత్ర ఇలా కొనసాగుతునే వుంటుంది/ మీరు ఎత్తి చూపిన పాలిండ్లు/ కరుణ చూపని కటిక శిలలయ్యేవరకూ/ గగుర్పొడిచేలా గరళబీజాలు నాటిన/ మా గర్భసంచుల్లో/ గన్నేరుకాయలు కాసేవరకూ' అంటూ గర్జిస్తారు కవయిత్రి పాటిబండ్ల రజని. బేటీ బచావో గురించి, సనాతన ధర్మం గురించి చెప్పే మీరు ఏ ముఖం పెట్టుకుని అంటారు...భారత్ మాతాకీ జై అని. దేశాన్ని ప్రపంచం ముందు నగ్నంగా నిలబెట్టినందుకు...వారు సిగ్గుపడాలి.