Aug 03,2023 06:45

నరేంద్రమోడీ నేతృత్వంలోని బిజెపి పాలనలో దేశంలో ఘోరాలకు, దారుణాలకు అంతులేకుండా పోతోంది. ఒక చోట జరిగిన అమానుషాన్ని మరచిపోకముందే మరో చోట ముష్కరమూకలు చెలరేగుతుంటాయి. విద్వేషాగ్నులు చిందిస్తూ మారణహోమాన్ని సృష్టిస్తుంటాయి. హర్యానాలో ఇప్పుడు జరుగుతున్నదదే! మణిపూర్‌లో భయానక హింసాకాండకు పాల్పడ్డ విద్వేష శక్తులు తమ నెత్తుటి దాహం తీర్చుకోవడానికి ఈ సారి హర్యానా లోని నుహ్ ప్రాంతంలో తొలుత విరుచుకుపడ్డాయి. ఇతర ప్రాంతాలకు విస్తరిస్తూ, ఒక ఇమామ్‌తో సహా ఆరుగురిని బలిగొన్నాయి. ఒక మతానికి చెందిన వారిని లక్ష్యంగా చేసుకుని ఆ శక్తులు సృష్టించిన హింసాకాండలో 70 మంది అమాయకులు గాయాలపాలైనారు. ఆస్తి నష్టమూ భారీగానే జరిగింది. ఏ క్షణంలో ఏమైనా జరగవచ్చన్న భయాందోళనలు స్థానిక ప్రజానీకంలో వ్యక్తమవుతున్నాయి. నిజానికి మణిపూర్‌లో రోజుకొకటిగా వెలుగులోకి వస్తున్న అంతులేని అమానుషత్వం దేశ ప్రజలను ఇంకా కలవరపరుస్తూనే ఉన్నాయి. అంతర్జాతీయంగా దేశాన్ని బోనులో నిలబెట్టిన ఈ దారుణంపై పార్లమెంటులో దేశ ప్రజలకు జవాబు చెప్పడానికి ప్రధానమంత్రి నరేంద్రమోడీ నిరాకరించడంతో ప్రతిపక్ష ఇండియా కూటమికి అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టడం మినహా మరో గత్యంతరం లేని స్థితి! ఆ అవిశ్వాస తీర్మానం కూడా ఇంకా చర్చకు రాలేదు. అంతలోనే హర్యానాలో మత చిచ్చు రేపడం సంఘ్పరివార్‌ మూకల బరితెగింపునకు నిదర్శనం!
2011 జనాభా లెక్కల ప్రకారం హర్యానా లోని నుహ్ జనాభా 10,767 మాత్రమే! హిందూ, ముస్లింల సామరస్య పూర్వక జీవనానికి ఈ చిన్న పట్టణం శతాబ్దాల చరిత్ర కలిగి ఉంది. ఇటువంటి ప్రశాంతత, సామరస్య జీవనం మతోన్మాదులకు సహజంగానే నచ్చవు గదా! అందులోనూ త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లో లబ్ధి పొందడమే లక్ష్యంగా ఒక పథకం ప్రకారం సంఘ్పరివార్‌ శక్తులు బరిలోకి దిగాయి. సాంప్రదాయంగా జరిగే బ్రజ్‌ మండల్‌ యాత్రను దీనికి అవకాశంగా తీసుకున్నాయి. శ్రీకృష్ణుడికి సంబంధించి కాలినడకన ఒకటి, రెండు నెలలు సాగే ఈ తీర్ధయాత్రకు స్థానిక ముస్లింలు సైతం సహకారాన్ని అందచేస్తారు. ఎవరి జోక్యం లేకుండా ప్రశాంతంగా సాగే ఆ యాత్రను సంఘ్పరివార్‌ మూకలు ఈ సారి విద్వేష విషం చిమ్మడానికి వేదికగా చేసుకున్నాయి. విశ్వహిందూ పరిషత్‌, బజరంగ్‌దళ్‌ వంటి సంస్థలు సోషల్‌మీడియాను ముస్లిం వ్యతిరేక ప్రచారంతో నింపేశాయి. గో గూండాల చేతిలో హత్యకు గురైన నాసిర్‌, జునాయిడ్‌లు గుర్తున్నారు కదా! ఆ హత్యలతో ప్రత్యక్ష సంబంధముందని ఆరోపణలు ఎదుర్కుంటున్న మోను మనేసర్‌ బాహాటంగానే ఈ ప్రచారంలో భాగమయ్యాడు. ఈ పరిణామాలపై నుహ్ ప్రజానీకం ఎప్పటికప్పుడు పోలీసుల, రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువచ్చారు. రక్షణ కల్పించాలని కోరారు. ఈ విజ్ఞప్తులను రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. ముందుజాగ్రత్త చర్యలు తీసుకోకుండా యాత్రకు అనుమతించింది. దీంతో ఉద్రిక్తత రాజుకుంది. సోషల్‌మీడియాలో విషప్రచారం జరిగినన్ని రోజులు కళ్లు మూసుకున్న ప్రభుత్వం నుహ్ లో దాడులు ప్రారంభం కాగానే ఇంటర్‌నెట్‌ను నిలిపివేసింది. దీంతో ఇతర ప్రాంతాల్లోని ప్రజానీకం అప్రమత్తం కావడానికి అవకాశం లేకుండా పోయింది. అదే సమయంలో అల్లరిమూకలు దాడులను విస్తరించాయి. ఇంత జరిగిన తరువాత కూడా ఆ రాష్ట్ర హోంశాఖ మంత్రి విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌లతో పాటు, హత్యారోపణలను ఎదుర్కుంటున్న మోను మనేసర్‌ను సైతం వెనకేసుకొచ్చారు. ముఖ్యమంత్రి మనోహర్‌ లాల్‌ ఖట్టర్‌ కుట్ర సిద్ధాంతాన్ని బయటకు తీశారు. విహెచ్‌పి, బజరంగ్‌దళ్‌తో పాటు ఇతర ఆర్‌ఎస్‌ఎస్‌ కుదురు సంస్థలు ఢిల్లీలో ధర్నా చేసి ఎన్‌ఐఎ విచారణ నిర్వహించాలని డిమాండ్‌ చేశాయి. దొంగే.. దొంగా, దొంగా అని అరవడమంటే ఇదే కదా!
మరోసారి అందలం ఎక్కడానికి ప్రజలను చీల్చే విష వ్యూహాలకు మతోన్మాద శక్తులు నిస్సిగ్గుగా దిగుతున్నాయి. మణిపూర్‌, హర్యానా సంఘటనలతో డబుల్‌ ఇంజన్‌ శక్తి ఎవరికి ఉపయోగపడుతోందో, ఎవరికి అండగా నిలుస్తోందో తేలిపోయింది. ఎన్నికలు ముంచుకొస్తుండటంతో ఇతర రాష్ట్రాలకూ ఈ తరహా ముప్పు పొంచే ఉంది. అందుకే, లౌకిక, ప్రజాతంత్ర శక్తులు మతోన్మాద పార్టీలను ఓడించేందుకు ఐక్యంగా కదలాలి. వరుస మారణహోమాలను చూసిన తరువాతైనా బిజెపికి మద్దతిస్తున్న వైసిపి, టిడిపి, బిజెడి వంటి ప్రాంతీయ పార్టీలు తమ వైఖరిని మార్చుకోవాలి. ఆచరణలో ప్రజలకు అండగా నిలవాలి. ప్రజానీకం సైతం పూర్తిస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి. మతోన్మాదుల కుట్రలను తిప్పికొట్టాలి.