Aug 09,2023 11:04
  • లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమకానున్న రూ.141.60 కోట్లు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీతోఫా ఈ ఏడాది ఏప్రిల్‌, జూన్‌ త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్లు ఆర్థికసాయం వారి బ్యాంకు ఖాతాల్లో జమకానున్నాయి. బుధవారం ఉదయం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి బటన్‌ నొక్కి జమ చేయనున్నారు. వైఎస్‌ఆర్‌ కళ్యాణమస్తు, వైఎస్‌ఆర్‌ షాదీతోఫాకు సంబంధించి సలహాలు, సూచనలు, ఫిర్యాదుల కోసం జగనన్నకు చెబుదాం 1902 టోల్‌ఫ్రీ నెంబరుకు సంప్రదించవచ్చు. పూర్తి వివరాలకు నవశకం బెనిఫీషియరీ మేనేజ్‌మెంట్‌ పోర్టల్‌ ష్ట్ర్‌్‌జూర//స్త్రరషర-అbఎ.aజూ.స్త్రశీఙ.ఱఅ వెబ్‌సైట్‌లో పొందవచ్చని ప్రభుత్వం పేర్కొంది.
 

                                                 దేవాదాయ భూముల పరిరక్షణ చట్టంతో సత్ఫలితాలు : మంత్రి కొట్టు

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : దేవాదాయ భూముల పరిరక్షణ చట్టం సత్ఫలితాలిస్తోందని, ఆదాయానికి తగ్గట్లుగా వర్గీకరణలో మార్పులు చేస్తున్నామని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పేర్కొన్నారు. మంగళవారం సచివాలయంలోని పబ్లిసిటీ సెల్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం, శ్రీశైలం భ్రమరాంభికా మల్లికార్జున స్వామి ఆలయం, అన్నవరం వీరవెంకట సత్యనారాయణస్వామి, ద్వారకా తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయాలు యాత్రికుల తాకిడితో ఆదాయం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. మాస్టర్‌ ప్లాన్‌కు అనుగుణంగా సెప్టెంబరు నెలలో పనులు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
 

                                                    ప్రభుత్వంలో ఆర్‌టిసి విలీనంపై టిఎస్‌ఆర్‌టిసి అధ్యయనం

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : ఎపిఎస్‌ఆర్‌టిసిని ప్రభుత్వంలో విలీనం చేసిన తీరును అధ్యయనం చేసేందుకు తెలంగాణ ఆర్‌టిసి ప్రతినిధి బృందం మంగళవారం రాష్ట్రంలో పర్యటించింది. తెలంగాణ నుంచి టిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు ఎస్‌ కృష్ణకాంత్‌, పివి మునిశేఖర్‌, చీఫ్‌ ఫైనాన్సియల్‌ మేనేజర్‌ విజయ పుష్పకుమారి తదితరులు విజయవాడలోని ఆర్‌టిసి హౌస్‌ను సందర్శించారు. విలీనం తర్వాత ఉద్యోగుల పరిస్థితి, ఉద్యోగుల సంక్షేమం, ఆర్థిక అంశాలపై ఎపిఎస్‌ఆర్‌టిసి ఎమ్‌డి ద్వారకా తిరుమలరావును అడిగి తెలుసుకున్నారు. అలాగే ఆర్‌టిసి స్థితిగతులను ఈ సందర్భంగా చర్చించారు. ఈ సమావేశంలో ఎపిఎస్‌ఆర్‌టిసి ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు కెఎస్‌ బ్రహ్మానందరెడ్డి, ఎ కోటేశ్వరరావు, పి కృష్ణమోహన్‌, ఫైనాన్సియల్‌ అడ్వైజర్‌ రాఘవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.