Aug 09,2023 21:45

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :పేదల జీవితాల్లో వెలుగులు నింపడంతోపాటు, ఆ కుటుంబాలు ఆర్థికంగా నిలబడేందుకు వైఎస్‌ఆర్‌ కళ్యాణ మస్తు, వైఎస్‌ఆర్‌ షాదీ తోఫా దోహదపడతాయని సిఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. క్యాంపు కార్యాలయంలో బుధవారంఆ పథకాల కింద ఆర్థికసాయాన్ని విడుదల చేశారు. ఏప్రిల్‌ాజూన్‌ 2023 త్రైమాసికంలో వివాహం చేసుకున్న అర్హులైన 18,883 జంటలకు రూ.141.60 కోట్ల ఆర్థిక సహాయాన్ని సిఎం బటన్‌ నొక్కి వారి లబ్ధిదారుల ఖాతాలో జమచేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంలో ఉన్న ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, వికలాంగులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లల కోసం ఈ పథకం తెచ్చినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఇప్పటి వరకు 35,551 జంటలకు మేలు జరిగిందన్నారు. ప్రతి ఏడాదీ మూడు నెలలకోసారి నాలుగు విడతల్లో కళ్యాణమస్తు కార్యక్రమం జరుగుతుందన్నారు. ఒక నెలపాటు వెరిఫికేషన్‌ పూర్తి చేసి మూడు నెలలకు సంబంధించిన ఆర్థికసాయం అందజేస్తున్నామన్నారు. పేద సామాజిక వర్గాల్లో పిల్లలు గొప్పగా చదివే పరిస్థితి రావాలన్నారు. షాదీ తోఫా కింద ఏకంగా రూ.లక్ష ఇస్తున్నట్లు తెలిపారు. వికలాంగులకు గత ప్రభుత్వంలో రూ.లక్ష ఇస్తామని ప్రకటించి ఇవ్వలేదని, తాము వారికి ఏకంగా రూ.1.50 లక్షలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నామన్నారు. భవన నిర్మాణ కార్మికులకు గత ప్రభుత్వంలో రూ.20 వేలు ప్రకటించి ఇవ్వకుండా వదిలేశారని, తమ ప్రభుత్వం రూ.40 వేలు ఇచ్చి ప్రోత్సహిస్తున్నట్లు సిఎం వెల్లడించారు. బాలికా విద్యను ప్రోత్సహించేందుకు తమ ప్రభుత్వం ప్రతి మండలంలో ఒక హైస్కూలు, ప్రత్యేకంగా బాలికల జూనియర్‌ కళాశాల ఉండేటట్లు మార్పు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కొట్టు సత్యనారాయణ, రాష్ట్ర మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేరుగ నాగార్జున, ధర్మాన ప్రసాదరావు, కెవి ఉషశ్రీ చరణ్‌, సిఎస్‌ కెఎస్‌ జవహర్‌రెడ్డి, సాంఘిక సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి, మైనార్టీ సంక్షేమశాఖ కార్యదర్శి ఎఎమ్‌డి ఇంతియాజ్‌ తదితరులు పాల్గొన్నారు.