మద్రాస్ హైకోర్టు తాజా ఉత్తర్వులు
చెన్నై : తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) నమోదు చేసిన మనీలాండరింగ్ కేసుపై మద్రాస్ హైకోర్టు సోమవారం కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కేసును చెన్నైలోని ఎంపి, ఎమ్మెల్యేల కేసుల ప్రత్యేక కోర్టు నుంచి మళ్లీ ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టుకు బదిలీ చేసింది. ఈ మేరకు జస్టిస్ ఆర్ సురేష్ కుమార్, జస్టిస్ కె కుమరేష్ బాబులతో కూడిన డివిజన్ బెంచ్ తీర్పు ఇచ్చింది. మంత్రి దాఖలు చేసిన బెయిల్ పిటీషన్ను కూడా సెషన్స్ కోర్టుకు తిప్పిపంపింది. తన బెయిల్ పిటీషన్ను ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు విచారించాలా లేక చట్టసభ్యుల ప్రత్యేక కోర్టు విచారించాలా.. అనే విషయంపై స్పష్టత ఇవ్వాలని కోరుతూ మంత్రి సెంథిల్ బాలాజీ దాఖలు చేసిన పిటీషన్ విచారణలో మద్రాస్ హైకోర్టు పై విధంగా తీర్పు ఇచ్చింది.










