- ఎపి సీడ్స్ వద్ద స్టాక్ నిల్
- ఆర్బికెలకు అరకొర సరఫరా
- పంపిణీ మొదలైన నాలుగు రోజులకే బంద్
ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- అమరావతి : ఖరీఫ్ సాగు కోసం ప్రభుత్వం రైతులకు రాయితీపై పంపిణీ చేయ తలపెట్టిన వేరుశనగ విత్తనానికి కొరత ఏర్పడింది. మే 29న విత్తనాల పంపిణీ ప్రారంభించగా నాలుగు రోజుల్లోనే నిల్వలు నిండుకున్నాయి. చాలా రైతు భరోసా కేంద్రాల (ఆర్బికె)కు స్టాక్ చేరుకోలేదు. అరకొరగా స్టాక్ వచ్చిన దగ్గర అయిపోయింది. సబ్సిడీ విత్తనం కోసం రైతులు ముందస్తుగా ప్రభుత్వం ఇచ్చే రాయితీ పోను తతిమ్మా సొమ్మును ముందే చెల్లించారు.
ఆర్బికెలకు కేటాయింపులు ఉన్నప్పటికీ ఆ మేరకు విత్తనాలు రాకపోవడంతో, డబ్బులు కట్టిన రైతుల్లో కొందరికే విత్తనం దొరికింది. మిగతా వారికి అందలేదు. అప్పుడొస్తుంది ఇప్పుడొస్తుంది అని సిబ్బంది సమాధానపరుస్తున్నారు. విత్తనం కోసం రైతులు ఆర్బికెల చుట్టూ తిరుగుతున్నారు. ఈ పరిస్థితులు అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో నెలకొన్నాయి. విత్తన పంపిణీ మొదలైన చిత్తూరు, తిరుపతి, కర్నూలు, నంద్యాల, కడప, అన్నమయ్య జిల్లాల్లోనూ పరిస్థితి ఇలానే ఉందని సమాచారం.
మే 15 తర్వాత అనుమతి
సబ్సిడీ వేరుశనగ విత్తనాల పంపిణీకి గత నెల 15 తర్వాత ప్రభుత్వం నుంచి అనుమతి వచ్చిందని, ఆలస్యంగా అనుమతి రావడంతో సేకరణ, ప్రాసెసింగ్, నిల్వ, రవాణా ఆలస్యమైందని వ్యవసాయశాఖ, ఎపి సీడ్స్ వర్గాలు చెబుతున్నాయి. అందువలన ఆర్బికెలలో రిజిస్ట్రేషన్లు మే 17న మొదలయ్యాయి. పంపిణీకి విత్తనాలను పూర్తి స్థాయిలో సిద్ధం చేయకపోవడంతో మే 29న పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు. రాష్ట్రంమొత్తమ్మీద సుమారు 3 లక్షల క్వింటాళ్ల పంపిణీ లక్ష్యం కాగా పంపిణీ మొదలయ్యే నాటికి లక్ష క్వింటాళ్లు కూడా ఆర్బికెలకు చేరలేదని సమాచారం. ఉమ్మడి అనంతపురం జిల్లాలో సుమారు రెండు లక్షల క్వింటాళ్లు పంపిణీ చేయాలనుకోగా, అందులో ఇప్పటికి 70 వేల క్వింటాళ్లే సిద్దం చేశారు. వాటిని కొన్ని ఆర్బికెలకు అదీ అరకొరగా పంపారు. అందిన వాటిలో సగానికిపైన పంపిణీ జరిగింది. తమకు స్టాక్ పంపాలని సిబ్బంది అడుగుతుండగా, పై నుంచి స్టాక్ లేదనే సమాధానం వస్తోంది. ప్రాసెస్ జరుగుతోందని, రావడానికి ఆలస్యం అవుతుందని జవాబిస్తున్నారని కిందిస్థాయి సిబ్బంది వాపోతున్నారు. ప్రస్తుతం విత్తనాలకు డిమాండ్ బాగానే ఉందని, రైతులు అడుగుతున్నారని, ముందస్తు పేమెంట్స్ సైతం - చేస్తున్నారని చెబుతున్నారు. ఎపి సీడ్స్ వద్ద పంపిణీకి విత్తనం సిద్ధంగా లేకపోవడంతో ముందుగా సబ్సిడీయేతర మొత్తాన్నీ చెల్లించిన రైతులు విత్తనం ఇవ్వకపోవడంతో ఆందోళన చెందుతున్నారు.
నాసిరకానికి బాటలు
ఈ నెల మొదటి వారంలో రుతుపవనాలొస్తాయని వాతావరణ శాఖ ఇస్తున్న సంకేతాలతో రాయలసీమలో వేరుశనగ సాగుకు రైతులు సమాయత్తమవుతున్నారు. అదనుకు విత్తనం దొరక్కపోతే రైతులు ఇబ్బందులు పడే ప్రమాదం ఉంది. విత్తన సేకరణను ఆలస్యం చేసి చివరి నిమిషంలో నాసిరకం, నకిలీ విత్తనాలను సరఫరా చేసేందుకు, మొత్తానికే పంపిణీ చేయకుండానే చేసినట్లు కాగితాలపై రాసుకొనే ప్రయత్నాలు సాగుతున్నాయని ఆరోపణలొస్తున్నాయి.










