May 23,2023 21:28

హైదరాబాద్‌ : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్‌ 2022 తుది పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. దేశ వ్యాప్తంగా 933 మందిని ఎంపిక చేశారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇషితా కిశోర్‌ తొలి ర్యాంకు సాధించారు. సివిల్స్‌ తుది ఫలితాల్లో తెలంగాణ, ఏపీ రాష్ట్రాలకు చెందిన పలువురు అభ్యర్థులు కూడా మెరిశారు.తిరుపతికి చెందిన బీవీఎస్‌ పవన్‌ దత్తా 22వ ర్యాంకు సాధించారు. హెచ్‌ఎస్‌ భావనకు 55, సాయి ప్రణవ్‌కు 60, నిధి పారు 110, అంకుర్‌ కుమార్‌ 257, చల్లా కళ్యాణి 285, వై శృతి 362, శ్రీకృష్ణ 293, హర్షిత 315, లక్ష్మి సుజిత 311, సోనియా కటారియా 376, రేవయ్య 410, సీహెచ్‌ శ్రవణ్‌ కుమార్‌ రెడ్డి 426, రెడ్డి భార్గవ్‌ 772, నాగుల కృపాకర్‌ 866వ ర్యాంకు సాధించారు.
మెయిన్స్‌లో అర్హత సాధించిన వారిని పర్సనాలిటీ టెస్టు కోసం ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు ఇంటర్వ్యూ చేసింది. ఫైనల్‌గా 933 మందిని వేర్వేరు సర్వీసులకు ఎంపిక చేసింది. మొత్తం 345 మంది జనరల్‌ కోటాలో ర్యాంకులు సాధించారు. ఇక 99 మంది ఈడబ్ల్యుఎస్‌ కోటాలో, 263 మంది ఒబిసి కోటాలో, 154 మంది ఎస్సీ కోటాలో, 72 మంది ఎస్టీ కోటాలో 2022 సివిల్‌ సర్వీసులకు ఎంపికయ్యారు.