Oct 05,2020 12:50

లక్నో : ఉత్తరప్రదేశ్‌లో అతివలకు రక్షణ లేకుండా పోతోంది. హథ్రాస్‌ ఘటనలపై ఓ వైపు నిరసనలు, ఆందోళనలు వెల్లువెత్తుతుండగానే.. మరికొన్ని సంఘటనలు వెలుగుచూశాయి.. తాజాగా యుపిలోని ముజఫర్‌ నగర్‌లో మహిళలపై అఘాయిత్యాలు చోటుచేసుకున్నాయి. గన్‌ పాయింట్‌లో పెట్టి ఓ మహిళను చెరుకు తోటల్లోకి లాక్కొళ్లి అత్యాచారానికి ఒడిగట్టాడో దుర్మార్గుడు. ఈ ఘటన ఆదివారం చోటుచేసుకుంది. మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శర్వణ్‌ కుమార్‌ అనే నిందితుణ్ని అరెస్టు చేశామని పోలీసులు సోమవారం తెలిపారు. ఐపిసి సెక్షన్‌ కింద పలు కేసులు నమోదు చేశామని చెప్పారు. అలాగే పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఓ అంధురాలిపై కొన్ని నెలలుగా సమీప బంధువొకరు అత్యాచారానికి పాల్పడ్డాడని మరో సంఘటనకు సంబందించిన వివరాలను పోలీసులు తెలిపారు. ఆ నిందితునిపై ఐపిసిలోని 376, 420 సెక్షన్‌ల కింద కేసు నమోదు చేశామన్నారు.

యుపిలో ఆగని అఘాయిత్యాలు
టీచర్‌ను కాల్చి చంపిన అగంతకుడు
ముజఫర్‌ నగర్‌లోని ఓ టీచర్‌ను కాల్చి చంపాడో అగంతకుడు. ఈ ఘటన ఆదివారం రాత్రి జరిగింది. మృతుడిని సుధీర్‌ కుమార్‌గా గుర్తించారు. బోపాడా గ్రామంలోని విద్యార్థులకు ట్యూషన్‌ చెప్పి.. మోటారు వాహనంపై ఇంటికి వస్తున్న టీచర్‌పై ఆగంతుకుడు కాల్పులు జరిపాడు. తీవ్రంగా గాయపడిన ఉపాధ్యాయుడిని ఆసుపత్రికి తీసుకెళ్లగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు.