
- 'వెలిగొండ'ను అక్టోబర్లో ప్రారంభిస్తామని ప్రకటించిన జగన్
- 11 ముంపు గ్రామాల ప్రజలు
- ఇప్పటికీ రిజర్వాయర్లోనే నివాసం
- ప్యాకేజీలు, పునరావాసం కోసం
- రూ.1,500 కోట్లకుపైగా అవసరం
ప్రజాశక్తి- ఒంగోలు బ్యూరో : 'వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించాకే ఎన్నికలకు పోతాం. అక్టోబరులో వెలిగొండ నీళ్లను విడుదల చేస్తాం' అని సిఎం జగన్ గతంలో ప్రకటించారు. ఇదే విషయాన్ని ఆయన పలుమార్లు సభల్లోనూ చెప్పారు. ఇటీవల కర్నూలు జిల్లాలోనూ గుర్తు చేశారు. అక్టోబర్ రానే వచ్చింది. మరో పది రోజులే మిగిలింది. ఆచరణకు తగ్గ చర్యలు లేవు. దీంతో, ఆయన హామీ మళ్లీ హుళక్కేనా? అనే చర్చ సాగుతోంది. వైసిపి అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే దీన్ని ప్రారంభిస్తామని జగన్ గతంలో ప్రకటించారు. ఏటా ఇదే మాట చెబుతూ వచ్చారు. ప్రాజెక్టును ఆయన సందర్శించారు. పనులపై గతంలో సమీక్ష కూడా చేశారు. పశ్చిమాన వైసిపికి బలం ఉన్నందున దీన్ని ఇప్పుడు హడావిడిగా పూర్తి చేయాల్సిన అవసరం ఏముందనే ధోరణి పాలకపక్షంలో కనిపిస్తోందన్న చర్చ సాగుతోంది. ఈ ప్రాజెక్టును మరో పది రోజుల్లో ప్రారంభిస్తారనే దానికి నమ్మశక్యంగా పనులు లేవు. చర్యలూ కనిపించడం లేదు. సిఎం ఈ నెలలో వస్తారా? లేదా? అనేదీ స్పష్టత లేదు. ప్రాజెక్టు పనులు పూర్తయి ఆఖరు దశలో ఉన్నాయి. నిర్మాణ పనులు దీని ప్రారంభానికి ఏమీ ఆటంకంగా లేవనే చెప్పాలి. అయితే, పునరావాసమే పెద్ద సవాలుగా మారింది. దీనిపై దృష్టి సారించిన దాఖలాల్లేవు. ఇప్పటికీ రిజర్వాయర్లోనే 11 ముంపు గ్రామాలు ఉన్నాయి. ఏడు వేల మందికిపైగా అక్కడే నివాసం ఉంటున్నారు. అక్కడి భూముల్లో అన్ని రకాల పంటలూ సాగు చేసుకుంటున్నారు. ప్రభుత్వం ప్యాకేజీలు, పరిహారాలు పూర్తిగా ఇచ్చి కాలనీల్లో ఇళ్లు కట్టించాక ఖాళీ చేద్దామనే ఆలోచనలో నిర్వాసితులు అక్కడే ఉన్నారు. ఈ ప్రాజెక్టుకు 1996లో అప్పటి సిఎం చంద్రబాబు శంకుస్థాపన చేశారు. 2004లో వైఎస్ సిఎం అయ్యాక పనులు మొదలయ్యాయి. డ్యాము పనులు ఎప్పుడో పూర్తయ్యాయి. రెండు సొరంగాల్లో మొదటి సొరంగం పనులు పూర్తి కాగా, రెండో సొరంగం పనులు ఆఖరు దశలో ఉన్నాయి. పొలాలకు గతంలోనే పరిహారం చెల్లింపు జరిగింది. ప్రాజెక్టును ప్రారంభించాలంటే ముందుగా అక్కడున్న నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వాలి. ఒక్కో కుటుంబానికీ రూ.12.50 లక్షలు వన్టైం సెటిల్మెంటు కింద ప్యాకేజీ ఖరారు చేశారు. ఇంతవరకూ నిధులు విడుదల కాలేదు. నిర్వాసితులు ఉన్నపళంగా బయటకు రావాలన్నా కుదరదు. ఎందుకంటే వారికి పునరావాస కాలనీల్లో ఇళ్లు కట్టించాలి. ఈ ప్రక్రియ కూడా జరగలేదు. ఇవన్నీ జరగాలంటే కనీసం రూ.1,500 కోట్లు నిధులు కావాలి. అయితే, రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్లో దీనికి రూ.101.47 కోట్లు మాత్రమే కేటాయించింది. మూడు జిల్లాల్లో 15 లక్షల మందికి తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ఉద్దేశించిన వెలిగొండ ప్రాజెక్టు పనులు ఇరవై ఏళ్లుగా సాగుతూనే ఉన్నాయి. అప్పట్లో అంచనా వ్యయం రూ.956 కోట్లు. ప్రస్తుతం ఇది రూ.8,108 కోట్లకు చేరింది. ఇప్పటివరకూ రూ.5,972.65 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంకా రూ.2 వేల కోట్లకుపైగా అవసరం ఉంది. ఎన్నికలకు ముందు రెండు గ్రామాలను ఖాళీ చేయించి ప్రారంభించాలనే ఆలోచనలో పాలకపక్ష నేతలు ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో నీళ్లు లేవు. అక్కడ నుంచే సొరంగాల ద్వారా వెలిగొండ రిజర్వాయర్కు నీరుచేరాలి. ఇదొక సమస్యగా మారింది. ఏదేమైనా సిఎం జగన్ హామీ అమలుపై సందిగ్ధత కొనసాగుతోంది.