ప్రజాశక్తి-భామిని : స్వయం శక్తి సంఘాలకు వ్యాపార ధోరణిని అలవాటు చేసి, సంఘాల ఆదాయం వనరులు సమాకూర్చే విధానాలపై విఒఎలు క్షేత్ర స్థాయిలో దృష్టిసారించాలని డిఆర్డిఎ పీడీ కిరణ్ కుమార్ తెలిపారు. పాలకొండ నియోజకవర్గంలో తొలగించిన ఓటర్ వివరాలను క్షేత్ర స్థాయిలో గురువారం బాలేరులో పరిశీలించారు. అనంతరం వైకెపి కార్యాలయంలో విఒఎలతో సమీక్షించారు. ప్రజలకు సబ్సిడీతో కూడిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలపై అవగాహన కలిగించాలని చెప్పారు. ప్రతిఒక్కరూ తీసుకున్న రుణం కట్టాలనే బాధ్యత పెంచాలన్నారు. మండల స్థాయిలో సంఘాల ద్వారా డిపార్ట్మెంట్ స్టోర్ ఏర్పాటు చేసి ఆదాయ వనరులు ఎలా పెంచాలో వివరించాలని సూచించారు. వన్ధన్ వికాస్ కేంద్రాలు కొన్ని చోట్ల ఫెయిల్ అవ్వటానికి కారణాలు మీకు తెలుసని తెలిపారు. రూరల్ మార్కెటింగ్లో భాగంగా 2 లక్షల పైబడి వ్యాపార సంబంధిత రుణాలు మండలంలో 25 వరకు చేయాలని సూచించారు. కార్యక్రమంలో ఎపిడి డి.భవాని పాల్గొన్నారు.










