Aug 23,2023 22:59

వీడియో కాన్ఫిరెన్స్‌లో మాట్లాడుతున్న కలెక్టర్‌ ఎం.గౌతమి

       అనంతపురం కలెక్టరేట్‌ : స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా ఈనెల 25వ తేదీలోపు వంద శాతం తప్పనిసరిగా ఇంటింటి సర్వే పూర్తి చేయాలని కలెక్టర్‌ ఎం.గౌతమి అధికారులను ఆదేశించారు. అనంతపురం కలెక్టరేట్‌లోని విసి హాల్‌ నుంచి స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌-2024కి సంబంధించి ఇంటింటి సర్వే, వివిధ అంశాలపై ఈఆర్‌ఒలు, ఎఇఆర్‌ఒలు, ఎలక్షన్‌ డిప్యూటీ తహశీల్దార్‌లు, బూత్‌ లెవెల్‌ ఆఫీసర్‌లతో బుధవారం నాడు వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ స్పెషల్‌ సమ్మర్‌ రివిజన్‌ - 2024లో భాగంగా జిల్లాలో ఇప్పటివరకు 98.8 శాతం ఇంటింటి సర్వే పూర్తి అయ్యిందన్నారు. రెండు రోజుల్లోగా దీనిని వందశాతం పూర్తి చేయాలన్నారు. అత్యంత అప్రమత్తంగా ఉంటూ ఎన్నికల కమిషన్‌ నుంచి ఏ సూచనలు వచ్చినా బిఎల్‌ఒలకు తెలియజేయాలన్నారు. ఈనెలాఖరులోపు రీవెరిఫికేషన్‌ ప్రక్రియ పకడ్బందీగా పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ కుషాల్‌ జైన్‌, ఆర్డీవోలు మధుసూదన్‌, నిశాంత్‌ రెడ్డి, రవీంద్ర, ఏపీఐఐసీ జెడ్‌ఎమ్‌ వరప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.