ప్రజాశక్తి-అనంతపురం కలెక్టరేట్ భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి వందే భారత్ రైలును ప్రారంభించారు. హైదరాబాదు నుంచి బెంగళూరు వరకు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన వందేభారత్ రైలు ఆదివారం అనంతపురం రైల్వే స్టేషన్ మీదుగా బెంగళూరుకు వెళ్లింది. ఈ సందర్భంగా అనంతపురం రైల్వే స్టేషన్లో వందేభారత్ రైలును ఆహ్వానిస్తూ ఘన స్వాగతం పలికారు. కోలాహలం నడుమ ఎంపీ తలారి రంగయ్య, జిల్లా పరిషత్ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, నగర మేయర్ వసీం, బిజెపి జిల్లా అధ్యక్షులు అంకిరెడ్డి శ్రీనివాసులు, రాష్ట్ర నాయకులు చిరంజీవి రెడ్డి, రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.అశోక్ కుమార్లు హాజరై జెండా ఊపి రైలును అనంతపు రం నుంచి ప్రారంభించారు. అంతకు మునుపు ఎంపీ మాట్లాడుతూ భారత ప్రభుత్వం సాధించిన ఘనత వందే భారత్ రైలు అన్నారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రోత్సాహంతోనే వందే భారత్ రైలు సాకారం జరిగిందన్నారు. భారత ప్రభుత్వానికి, రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. ప్రయాణికులు తక్కువ సమయంలోనే గమ్యానికి చేరుకోవచ్చు అన్నారు. కిసాన్రైల్ సేవలు కూడా అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రైల్వే స్టేషన్ మేనేజర్ ఎం.అశోక్ కుమార్ ప్రయాణికులకు విమానంలో ప్రయాణిస్తున్న అనుభవం కలుగుతుందన్నారు. విభిన్న ప్రతిభావంతులకు కూడా సైకిల్ పెట్టుకునేలా సౌకర్యాలు కల్పించారని తెలిపారు. ఆటోమెటిక్ డోర్ బయోమెట్రిక్ టాయిలెట్స్ ఉంటాయని తెలిపారు.
వందేభారత్ రైలును ప్రారంభిస్తున్న నాయకులు










