స్పందనలో అర్జీ
ప్రజాశక్తి - చాట్రాయి
మండలంలోని చిత్తపూరు గ్రామానికి చెందిన మునేటి శిరీష వితంతు పింఛను ఇప్పించాలని స్పందన కార్యక్రమంలో మండల తహశీల్దార్ సిహెచ్ .విశ్వనాథరావుకు అర్జీ సమర్పించారు. తన భర్త శ్రీనివాసరావు 2021 మే 23వ తేదీన చనిపోయాడని, 2022 నవంబర్లో వితంతు పింఛన్కు అర్జీ పెట్టుకొన్నాని తెలిపారు. కానీ తనకు వితంతు పింఛన్ మంజూరు కాలేదని, ఇప్పటికీ ఎన్నోసార్లు వితంతు పింఛన్కి అర్జీ పెట్టుకున్నా, ఫలితం లేకుండా పోయిందన్నారు. ఆన్లైన్లో పింఛన్ అప్రూవల్ అయిందని చెబుతున్నారు తప్ప డబ్బులు ఇవ్వటం లేదని, అర్హత ఉండి కూడా వితంతు పింఛన్ రాకపోవడంతో కూలీ పనులు చేసుకుని పిల్లల్ని పోషించుకుంటున్నానని తెలిపారు. పోషణ ఇబ్బందికరంగా ఉందన్నారు. సిపిఎం అనుబంధ వ్యవసాయ గ్రామీణ కార్మిక సంఘం నాయకులు కొమ్ము ఆనందం మునేటి శిరీషతో సోమవారం తహశీల్దార్కు అర్జీ సమర్పించారు. వెంటనే సమస్యను పరిష్కరించి, పింఛను మంజూరు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని కొమ్ము ఆనందం తెలిపారు.










