Nov 08,2023 22:50

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేయాలి విద్యార్థుల బంద్‌ విజయవంతం

విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ రద్దు చేయాలి
విద్యార్థుల బంద్‌ విజయవంతం
బంద్‌ చేస్తున్న విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు

ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్‌: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ రద్దు చేయాలని కోరుతూ ఏఐఎస్‌ఎఫ్‌, టిఎన్‌ఎస్‌ఎఫ్‌, బిఎస్‌యు విద్యార్థి సంఘాలు బుధవారం చేపట్టిన బంద్‌ విజయవంతం అయ్యింది. ఈ సందర్భంగా టిఎన్‌ఎస్‌ఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ప్రణవ్‌ గోపాల్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర బంద్‌కు తెలుగునాడు విద్యార్థి సమాఖ్య మద్దతుతోపాటు జనసేనకు అనుబంధ సంస్థ భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మద్దతు తెలియజేస్తున్నామని తెలిపారు. ఏఐఎస్‌ఎఫ్‌ చిత్తూరు జిల్లా కన్వీనర్‌ ప్రవీణ్‌ కుమార్‌ మాట్లాడుతూ విద్యార్థి, యువజన నాయకులు 32మంది ప్రాణత్యాగాలతో ఏర్పాటైన విశాఖఉక్కు ఫ్యాక్టరీని మోడీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పూనుకోవడాన్ని నిరసిస్తూ జరుగుతున్న ఆత్మగౌరవ పోరాటం నవంబర్‌ 8 నాటికి 1000 రోజులు పూర్తి అయిన సందర్భంగా బంద్‌ చేపట్టినట్లు తెలిపారు. కరోనా కష్టకాలంలో లక్షల మందికి ఆక్సిజన్‌ అందజేసి ప్రాణాలు నిలబెట్టిన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కార్పొరేట్‌ కంపెనీలకు దోచిపెట్టాలన్న ఆలోచన దుర్మార్గమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధిని కల్పిస్తున్న విశాఖ ఉక్కును ప్రైవేటీకరణ చేస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కడపలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అయితే లక్షలాదిమంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని తెలిపారు. టిఎన్‌ఎస్‌ఎఫ్‌ నాయకులు ప్రభుతేజ, ఆదిత్య, జగన్‌, శ్యాంప్రసాద్‌, భగత్‌ సింగ్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ నాయకులు చైతన్య, తరుణ్‌, వినరు, కుల్దీప్‌, ముని, దుర్గ పాల్గొన్నారు.