
'దొరసాని, మిడిల్ క్లాస్మెలోడీస్' లాంటి సినిమాలతో టాలీవుడ్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు ఆనంద్ దేవరకొండ. ప్రస్తుతం 'పుష్పక విమానం'తో నటుడిగా మరో మెట్టు ఎక్కాడు ఆనంద్. పెళ్లయిన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఎన్నో అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకొచ్చిన 'పుష్పక విమానం' ఏ మేరకు విజయం సాధించిందో చూద్దాం !
టైటిల్ : పుష్పక విమానం
నటీనటులు : ఆనంద్ దేవరకొండ, గీత్ సైనీ, శాన్వీ మేఘన, సునీల్, నరేశ్, హర్షవర్థన్ తదితరులు
నిర్మాణ సంస్థ : కింగ్ ఆఫ్ ది హిల్, టాంగా ప్రొడక్షన్స్
నిర్మాతలు : గోవర్థన్ రావు దేవరకొండ,
విజరు మిట్టపల్లి, ప్రదీప్ ఎర్రబెల్లి
దర్శకత్వం : దామోదర
సంగీతం : రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని
సినిమాటోగ్రఫీ: హెస్టిన్ జోస్ జోసెఫ్
విడుదల తేదీ : నవంబర్ 12, 2021
చిట్టిలంక సుందర్ (ఆనంద్ దేవరకొండ) ప్రభుత్వ పాఠశాలలో లెక్కల మాస్టర్గా పనిచేస్తుంటాడు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని అమాయకపు చక్రవర్తి. పెళ్లిపై బోలెడు ఆశతో మీనాక్షి (గీత్ సైనీ) తో వివాహం జరుగుతుంది. ఆమెను తీసుకుని సిటీకి వస్తాడు. ఐతే తొలి రాత్రే వీరి మధ్య అనుకోకుండా అభిప్రాయ భేదాలు వస్తాయి. దీంతో పెళ్లైన వారానికే మీనాక్షి వేరొకరితో పారిపోతుంది. అయితే ఆ విషయం బయటకు చెప్తే పరువుపోతుందని.. సుందర్ తన భార్య ఇంట్లోనే ఉన్నట్టుగా నమ్మిస్తాడు. దీనిలో భాగంగా షార్ట్ఫిల్మ్ హీరోయిన్ రేఖ (సాన్వి మేఘన) సుందర్కి అవసరం వచ్చిన ప్రతిసారీ భార్యగా నటిస్తూ వస్తుంది. భార్య వెళ్లిపోయిందనే విషయం అటు పోలీసులకు చెప్పకుండా తన భార్య ఆచూకీ కోసం వెతుకుతూనే ఉంటాడు సుందర్. ఈ సందర్భంలో సుందర్ భార్య మీనాక్షి హత్యకి గురౌతుంది. హత్యా నేరంపై సుందర్ అరెస్ట్ అయ్యి, చిక్కుల్లో ఇరుక్కుంటాడు. ఇంతకీ మీనాక్షిని ఎవరు హత్య చేశారు? అసలు ఆమె సుందర్ని వదిలేసి ఎందుకు పారిపోయింది? ఆ తరువాత ఏమైంది అనేదే 'పుష్పక విమానం' కథ
పెళ్లయిన కొద్దిరోజులకే తన భార్య మిస్సయిందనే ఆసక్తికర పాయింట్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు దామోదర. డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ కొత్తగా ఉన్నప్పటికీ.. తెరపై మాత్రం అంత ఆసక్తికరంగా చూపించలేకపోయాడు. ఫస్టాఫ్లో కథ పెద్దగా ఏమీ ఉండదు. భార్య మిస్సయిందనే పాయింట్ చుట్టూనే కథ తిరుగుతుంది. భార్య కనిపించడం లేదని పోలీస్ కంప్లైంట్స్ ఇస్తే పరువు పోతుందని.. తనే వెతకడం ప్రారంభిస్తాడు. ఈ క్రమంలో వచ్చే కొన్ని సీన్స్ కడుపుబ్బా నవ్విస్తాయి. అదే సమయంలో కొన్ని సీన్స్ సాగదీతగా అనిపిస్తాయి. కానీ ఇంటర్వెల్ ముందు ఇచ్చే ట్విస్ట్ మాత్రం అదిరిపోవడంతో పాటు సెకండాఫ్పై ఆసక్తిని పెంచుకుంది. మీనాక్షిని ఎవరు హత్య చేశారనే విషయాన్ని చివరివరకు చెప్పకుండా, సెకండాఫ్లో కథను ఆసక్తికరంగా నడిపించాడు. అయితే పోలీసు విచారణ మాత్రం నాటకీయంగా సాగడం సినిమాకు మైనస్. వివాహబంధం గురించి దర్శకుడు ఏదో గొప్పగా చెప్పాలనే ప్రయత్నం చేశాడని తెలుస్తుంది.
కాసేపట్లో తన పెళ్లనగా హీరో కోసం హీరోయిన్ పెళ్లి మండపం నుంచి పారిపోవడం.. లేదా పెళ్లి తర్వాత భర్తకు హ్యాండిచ్చి వెళ్లిపోవడంలాంటి దృశ్యాలు తెరమీద చాలా చూసి ఉంటాం. అలా పెళ్లి వద్దనుకుని హీరో కోసం హీరోయిన్ వచ్చేస్తుంటే సరదాగా.. క్రేజీగా ఉంటుంది. ఐతే ఇలా అమ్మాయి పారిపోయి వచ్చేస్తే.. అవతల పెళ్లికొడుకు పరిస్థితి ఏంటి అన్న ఆలోచన ఎప్పుడూ కలగదు. అతడి కోణంలో చూస్తే అది మామూలు శిక్ష కాదు. సమాజం ఆ వ్యక్తిని ఎలా చూస్తుంది.. ఆ వ్యక్తి మానసిక స్థితి ఎలా ఉంటుందనే ఆలోచనతో రెండు దశాబ్దాల కిందట త్రివిక్రమ్ శ్రీనివాస్ 'చిరునవ్వుతో' అనే కథ రాసి ప్రేక్షకులకు ఒక కొత్త అనుభూతిని ఇచ్చాడు. మళ్లీ ఇన్నేళ్లకు దామోదర అనే కొత్త దర్శకుడు 'పుష్పక విమానం'లో ఈ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఐతే త్రివిక్రమ్ కొంచెం ఫన్ జోడించి, చాలా వరకు సీరియస్గా ఈ ఇష్యూను డిస్కస్ చేస్తే.. దామోదర ఈ పాయింట్ను వినోదానికి వాడుకోవాలని చూశాడు. అలాగే కొంచెం ఉత్కంఠ రేకెత్తించాలనీ ప్రయత్నించాడు. కాన్సెప్ట్ బాగున్నా.. ఎగ్జిక్యూషన్లో తేడా కొట్టింది.
మొదటి రెండు సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ నటన కాస్త మెరుగుపడింది. ప్రభుత్వ ఉపాధ్యాయుడు చిట్టిలంక సుందర్ పాత్రలో ఒదిగిపోయాడు. ఇక మీనాక్షిగా గీత్ సైనీ మెప్పించింది. ఉన్నంతలో తనదైన నటనతో ఆకట్టుకుంది. ఇక సుందర్ నకిలీ భార్య రేఖ పాత్రలో శాన్వీ మేఘన ఒదిగిపోయింది. పోలీసాఫీసర్ రంగాగా సునీల్ తనదైన నటనతో ఆకట్టుకున్నాడు. స్కూల్ హెడ్మాస్టర్గా నరేశ్తో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. రామ్ మిరియాల, సిద్ధార్థ్ సదాశివుని, అమిత్ దాసాని సంగీతం బాగుంది. సిద్ శ్రీరామ్ ఆలపించిన 'కళ్యాణం కమనీయం ఒకటయ్యే వేళనా.. వైభోగం' అనే సాంగ్ మినహా మిగతా పాటలన్నీ అంతంత మాత్రమే.. బిజిఎం మాత్రం సినిమాకి హైలెట్. హెస్టిన్ జోస్ జోసెఫ్ సినిమాటోగ్రఫి బాగుంది. ఎడిటర్ రవితేజ గిరిజాల తన కత్తెరకు పనిచెప్పాల్సింది. విజువల్స్, ప్రొడక్షన్ విలువలూ బావున్నాయి.