Sep 12,2023 20:15

సమావేశంలో మాట్లాడుతున్న సిఐ వెంకటేశ్వర్లు

ప్రజాశక్తి - హోళగుంద
వినాయక ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని ఆలూరు సిఐ వెంకటేశ్వర్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులకు, ప్రజలకు సూచించారు. మంగళవారం స్థానిక పోలీసు స్టేషన్‌లో ఉత్సవ కమిటీ నిర్వాహకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ఎవరికీ ఇబ్బంది కలుగకూడదన్నారు. వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే వారు తప్పనిసరిగా పోలీసులు అనుమతి తీసుకోవాలని సూచించారు. విగ్రహాలను ఏర్పాటు సమయం, నిమజ్జన సమయాలను విగ్రహాల ఏర్పాటుకు అనుమతి కోరే పత్రాల్లో పొందుపరచాలని తెలిపారు. పోలీసుల సూచనలను అతిక్రమించినా, పాటించకపోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్‌ఐ శ్రీనివాసులు పాల్గొన్నారు.