పుట్టపర్తి రూరల్ : సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా ప్రమాణాలు పెరగాలంటే అధికార యంత్రాంగం, ఎయిర్ పోర్ట్ నిర్వాహకుల మధ్య సమన్వయం వల్లనే సాధ్యమని ఎస్పీ మాధవరెడ్డి, కలెక్టర్ అరుణ్ బాబు తెలియజేశారు. మంగళవారం నాడు పుట్టపర్తి విమానాశ్రయం నందు ఎయిర్ పోర్ట్ భద్రత కమిటీ ఛైర్మెన్ హోదాలో కలెక్టర్ అధ్యక్షతన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎయిర్పోర్ట్ అడ్మిన్ లక్ష్మీనారాయణ, ఎయిర్ పోర్ట్ డైరెక్టర్ సాయినాథ్ ఆర్డీవో భాగ్యరేఖ పాల్గొన్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ సత్యసాయి విమానాశ్రయంలో భద్రతా పరమైన సమస్యలు తలెత్తినప్పుడు ఏయే శాఖలు ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనే అవగాహన ఉండాల్సిన అవసరం ఉందన్నారు. అది కేవలం విమానాశ్రయ నిర్వాహకులు, ప్రభుత్వ శాఖల మధ్య సమాచార బదిలీ ద్వారానే సాధ్యమవుతుందన్నారు. సంబంధిత శాఖలు సమన్వయంతో పనిచేసి ఎయిర్పోర్టులో భద్రతా ప్రమాణాలు పెంచుదామని పిలుపునిచ్చారు. తొందర్లోనే ఈ విమానాశ్రయాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా కమర్షియల్ ఏర్పాటుగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపుతామని దీని ద్వారా చుట్టుపక్కల ప్రాంతం ప్రజలకు ఎంతో ఉపయోగంగా ఉంటుందని తెలిపారు. అనంతరం, పుట్టపర్తి ఎయిర్ పోర్ట్ అధికారులు పుట్టపర్తి విమానాశ్రయంపై పవర్ ప్రజెంటేషన్ కార్యక్రమాన్ని అధికారుల తిలకించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఎస్పీ డిపిఒ వాసుదేవ, డీఎస్పీ విజరు కుమార్, శంకర్ ప్రసాద్, ఏర్పోర్ట్ ఎస్ఐ సుబ్బారావు, రవీంద్రనాథ్ రెడ్డి, తహశీల్దార్ నవీన్ కుమార్, జిల్లా ఫైర్ ఆఫీసర్ విమానాశ్రయ సిబ్బంది, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు.










