Nov 08,2023 22:38

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి

విద్యుత్‌ షాక్‌తో ఏనుగు మృతి

ప్రజాశక్తి -సదుం : మండల పరిధిలోని గంటా వారిపల్లి పరిసర ప్రాంతాలలోని పంట పొలాల్లో ఒంటరి ఏనుగు మతి చెందిన విషయం బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలు ఇలా వున్నాయి. మొరవ పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని గంటావారి పల్లి కి చెందిన ఎద్దుల గోవిందమ్మ వరి మడిలో మంగళవారం రాత్రి ఒక ఏనుగు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మన్‌ను ఢకొీని, విద్యుత్‌ షాక్‌తో మరణించి ఉంటుందని గ్రామస్తుల సమాచారం. సర్పంచి జగన్నాధం మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఒంటరి ఏనుగు పంట పొలాల్లో సంచరిస్తున్నట్లు రైతుల ద్వారా తనకు సమాచారం ఉందని తెలిపారు. బుధవారం ఏనుగు మృతిచెందిందన్న విషయం తెలియడంతో చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో ఏనుగు మృతదేహాన్ని చూసేందుకు వచ్చారు. విషయం తెలుసుకున్న ఎఫ్‌ఎస్‌ఒ బాలసుబ్రమణ్యం, బీట్‌ ఆఫీసర్లు మహేష్‌, షాజహాన్‌, ట్రాకర్లు సిద్దయ్య, రమణ, చిన్నయ్య, శశికుమార్‌ ఏనుగు మృతదేహం స్థలం వద్దకు చేరుకుని ఉన్నతాధికారులకు సమాచారం ఇచ్చారు. తహశీల్దార్‌ చంద్రశేఖర్‌, ఎస్‌ఐ మారుతి ఆధ్వర్యంలో ఏనుగు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి, అనంతరం జేసీబీ సాయంతో పక్కనే ఉన్న పొలాల్లో పూడ్చి పెట్టారు.
ఏనుగులు దాడి, దిక్కు తోచని అన్నదాతలు
గత కొన్ని రోజులుగా సదుం మండల పరిధిలోని గంటా వారిపల్లి, జోగి వారిపల్లి, నాయనపాకాల, చెరుకువారిపల్లి, కుమ్మర పల్లి తదితర ప్రాంతాలలో ఏనుగులు బెడద ఎక్కువై పోయినట్లు స్థానిక రైతులు వాపోతున్నారు. ఏనుగులు రాత్రి వేళల్లో పంట పొలాలపై దాడి చేసి చెరకు, వరి, టమోటా తదితర కూరగాయల పంటలను ధ్వంసం చేస్తున్నాయని రైతులు తెలిపారు. ఈసందర్బంగా మొరవపల్లి సర్పంచ్‌ జగన్నాథం విలేకరులతో మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఏనుగులు రైతుల పంట పొలాలపై పడి, పంటలను తీవ్రంగా నష్ట పరుస్తున్నట్లు తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారులతో రైతులు మెరపెట్టుకొన్నా రైతులకు ఎలాంటి న్యాయం జరగలేదని వాపోయారు. ఇకనైనా ప్రభుత్వం ఈవిషయంలో రైతులకు మేలు జరిగే చర్యలు చేపట్టాలనికోరారు.