పార్వతీపురంటౌన్: విద్యుత్ బిల్లు తగ్గించే వరకు పోరాటం ఆగదని సిపిఎం పట్టణ కమిటీ కార్యదర్శి గొర్లి వెంకటరమణ, కమిటీ సభ్యులు పాకల సన్యాసిరావు, బంకురు సూరిబాబు ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా కేంద్రంలోని ప్రధానరహదారిలో ప్రదర్శన, ప్రచారం చేసి, బందం వారి వీధి జంక్షన్ వద్ద వ్యక్తిగత విద్యుత్ బిల్లులను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఇఎల్ఆర్ పేరుతో చేస్తున్న విద్యుత్ కోతలు నిలిపివేయాలని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరెంటు బిల్లులు అనేక పద్ధతుల్లో పెంచి ప్రజలపై ఆర్ధికభారాలు వేస్తున్నారని అన్నారు. నిత్యవసర ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని, ఉపాధి, పనికితగ్గ వేతనం లేక ఆర్థిక ఇబ్బందుల్లో ప్రజలున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ప్రజలపై భారాలు వేయడం సరికాదన్నారు. అన్నారు. ఇందులో భాగంగానే ఈనెల 4 (సోమవారం) స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో నిరసన చేపట్టనున్నట్టు తెలిపారు. కార్యక్రమంలో ప్రజలు పెద్దఎత్తున పాల్గొని ప్రభుత్వ వ్యతిరేకతను తెలపాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సిహెచ్.లక్ష్మణరావు, టి.శ్రీను, టి.బాబూరావు, తదితరులు పాల్గొన్నారు.










