
ప్రజాశక్తి-పొదిలి : పొదిలి ప్రాంతంలో ఉన్నత విద్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన వ్యక్తి మువ్వల శ్రీహరి అని ఎస్వికెపి డిగ్రీ కళాశాల కరస్పాండెంట్ గునుపూడి చెంచు సుబ్బారావు తెలిపారు. స్థానిక ఎస్వికేపి డిగ్రీ కాలేజీలో కళాశాల వ్యవస్థాపకులు దివంగత మువ్వల శ్రీహరి జయంతిని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా కళాశాల ఆవరణలోని ఆయన విగ్రహానికి కాలేజీ యాజమాన్యం, మానవత స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో వక్తలు మాట్లాడుతూ దశాబ్దాలుగా వెనకబడిన పొదిలి ప్రాంతంలో ఉన్నత విద్యాభివృద్ధికి, డిగ్రీ కళాశాల ఏర్పాటుకు శ్రీహరి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో పేదలకు, వికలాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ప్రభుత్వ వైద్యశాలలో మువ్వల శ్రీహరి కుమారుడు మానవతా స్వచ్ఛంద సంస్థ చైర్మన్ మువ్వల పార్థసారథి రోగులకు పండ్లు, బెడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మానవతా సంస్థ సభ్యులు కె.యలమందరెడ్డి, కాటూరి వెంకట నారాయణ బాబు, మాగులూరి రామయ్య, కళ్లం సుబ్బారెడ్డి, యర్రంరెడ్డి వెంకటేశ్వర రెడ్డి, సానికొమ్ము శ్రీనివాస్రెడ్డి, జి.శ్రీను, సామంతపూడి నాగేశ్వరరావు, భవాని శ్రీనివాసరావు, సోమిశెట్టి చిరంజీవి, లోక్ సత్తా జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్, తానికొండ వెంకట రావు, కళాశాల అధ్యాపకులు, సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.