ధర్మవరం టౌన్ : అర్హత ఉన్న ప్రతి నిరుపేదలకు సొంతింటి కలను వైసిపి ప్రభుత్వం నిజం చేస్తోందని మున్సిపల్ ఛైర్పర్సన్ కాచర్ల లక్ష్మి పేర్కొన్నారు. శనివారం నాడు పోతులనాగేపల్లి లేఅవుట్లో గృహ నిర్మాణ లబ్ధిదారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి ఛైర్పర్సన్తో పాటు హౌసింగ్ పీడీ చంద్రమౌళిరెడ్డి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న, వైస్ ఛైర్మెన్ యర్రగుంట్ల భాగ్యలక్ష్మి, హౌసింగ్ ఈఈ చంద్రశేఖర్, డీఈ మునిశ్వరనాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకాన్ని ప్రారంభించి నేటికి ఎనిమిది సంవత్సరాలు అయ్యిందన్నారు. ఈ సందర్భంగా సొంతింటిని నిర్మించుకున్న లబ్ధిదారుల అభిప్రాయాలను అడిగి తెలుసుకుంటున్నట్లు తెలిపారు. జగన్న లేఅవుట్లో నిర్మాణాలకు అవసరమైన అన్ని వసతులనూ కల్పిస్తున్నట్లు చెప్పారు. అనంతరం నిర్మాణాలు పూర్తయిన ఇళ్లను లబ్దిదారులతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ శ్రీధర్, హౌసింగ్ ఏఈ బాలాజీ, విద్యుత్ శాఖ ఏఈ జానకి రామయ్య తదితరులు పాల్గొన్నారు.










