ప్రజాశక్తి అమడుగూరు : కదిరి రూరల్ మండలం కదిరి బ్రాహ్మణపల్లి రైతు భరోసా కేంద్రం పరిధిలో కదిరి బ్రాహ్మణపల్లి కస్టం హైరింగ్ సెంటర్కు వైఎస్ఆర్ యంత్ర సేవా పథకం క్రింద మంజూరైన ట్రాక్టర్ను స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ పివి. సిద్దా రెడ్డి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతి రైతు భరోసా కేంద్రం పరిధిలో ఒక కస్టం హైరింగ్ సెంటర్ను ఏర్పాటు చేసి ఈ సెంటర్ ద్వారా ట్రాక్టర్, వ్యవసాయ పనిముట్లు అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ వ్యవసాయ పనిముట్ల ద్వారా రైతులు దుక్కి నుండి నూర్పిడి వరకు అవసరమైన వాటిని ఉపయోగించుకోనే వెసులుబాటు కల్పించారన్నారు. అంతేకాకుండా రైతులకు అవసరమగు నాణ్యమైన విత్తనాలు సరఫరా చేయడంతో పాటు, ఎరువులను రైతు భరోసా కేంద్రంలో సబ్సిడీ ధరలతో అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, వైసిపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










