
ఉత్తరాంధ్ర వెనుకబాటుకు కారణాలను, ఉత్తరాంధ్ర జీవితాలను కథలుగా, నవలలుగా, వ్యాసాలుగా కొన్ని శకలాలుగా రచయితలు చిత్రించడం మనందరికీ విదితమే. ప్రస్తుత ఉత్తరాంధ్ర ప్రజల జీవితం ఇలా ఉంది, ఇలా ఎందుకుంది? ఎలా ఉండాలి? అన్న అంశాలను ఒకే పుస్తకంలో తెలుసుకోవాలంటే ఎ. అజశర్మ రాసిన, ప్రజాశక్తి బుకహేౌస్ వారు ప్రచురించిన ''ఇంకెన్నాళ్లీ వెనుకబాటు?'' పుస్తకాన్ని చదవాల్సిందే. ''అభివృద్ధి అంటే ఏమిటి?'' అను వ్యాసం నుండి ''అభివృద్ధి వ్యూహం'' అను వ్యాసం వరకూ 15 వ్యాసాలను ఒక దగ్గర గుదిగుచ్చి, మనకు ఉత్తరాంధ్రపై ఒక సమగ్ర అవగాహన తీసుకువస్తుందీ పుస్తకం. ''అపారమైన ప్రకృతి వనరులు, గుండె నిబ్బరం గల మానవ వనరులు ఉన్న ఉత్తరాంధ్ర ఎందుకు వెనుకబడి ఉంది?'' అను ప్రశ్నకు సమాధానాన్ని తెలుసుకోవాలంటే ఈ పుస్తకం చదవాల్సిందే. 15 అధ్యాయాలలో సుమారు 17 రకాల ప్రభుత్వ రికార్డుల పట్టికలనే ఆధారంగా చూపించి, ఉత్తరాంధ్ర వెనుకబాటును ఆధారాలతో సహా నిరూపించారు రచయిత.
పుస్తకం పేరు : ఇంకెన్నాళ్లీ వెనుకబాటు?
ఉత్తరాంధ్ర అభివృద్ధి వ్యూహం
రచయిత : ఎ. అజశర్మ,
వెల : రూ. 50
ప్రతులకు : ప్రజాశక్తి బుకహేౌస్ అన్ని
షాపులలో లభిస్తాయి.
ఉత్తరాంధ్ర అటవీ, మైదాన, సముద్ర ప్రాంతాల భిన్న సమాహారం. 23,537 చ.కి.మీ. భూభాగం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రజలు ఎక్కువశాతం వ్యవసాయ, మత్స్యకార, గిరిజన జీవితానికి చెందినవారే. అందువల్ల రచయిత ఈ ప్రాంతపు వ్యవసాయాన్ని, పర్యావరణాన్ని, గిరిజన జీవితాన్ని.. అలాగే పరిశ్రమలను, ఉద్యమాలను ఒక్కొక్క అధ్యాయంగా వివరించారు. ఇన్ని జీవ నదులున్న ఈ ప్రాంతంలో పండుగగా చేసుకోవాల్సిన వ్యవసాయం ఎందుకు దండగగా మారిందో రచయిత కారణాలను చూపించారు. అందులో ముఖ్యకారణం సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణంలో పాలకుల చిత్తశుద్ధి లోపాలు, బాబూ జగజ్జీవనరాం ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, వంశధార రెండోదశ ప్రాజెక్టు, తారకరామ తీర్థ సాగర ప్రాజెక్టు, ఆఫ్షోర్ రిజర్వాయర్ ప్రాజెక్టు, గుర్లగడ్డ ప్రాజెక్టు మొదలైనవి ప్రారంభించి, చిన్న చిన్న కారణాలతో ఏవిధంగా ఆపేశారో ఈ పుస్తకం వివరించింది. అలాగే వ్యవసాయ భూమి చిన్న చిన్న కమతాలుగా ఉండటం వల్ల, ఆధునిక వ్యవసాయ పద్ధతులు ఉపయోగించ లేకపోవటం వలన వ్యవసాయ ఫలం గిట్టుబాటు కావడంలేదు. వ్యవసాయాధారిత పరిశ్రమలు మూతపడటం వల్ల ఉపాధి కరువై, ఈ ప్రాంత ప్రజలు వలసబాట పడుతున్నారు.
''తీరప్రాంతంలోనూ, మత్స్యకార జనాభాలోనూ రాష్ట్రంలో మూడో వంతుకు పైగా ఉత్తరాంధ్రలోనే ఉన్నారు. అయితే అధునాతన బోట్లు వాడకంలో నేటికీ వెనుకబడి ఉన్నారు. సుమారు మూడు లక్షల మంది జనాభా ఈ వృత్తిపై ఆధారపడి ఉన్నా, ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడం వల్ల వీళ్లు పేదరికంలో మగ్గుతున్నారు'' అనే విషయాన్ని ఈ పుస్తకం పట్టికలతో సహా నిరూపించింది.
రాష్ట్రంలో అత్యధిక గిరిజన ప్రాంతం ఉత్తరాంధ్రలోనే ఉంది. జనాభారీత్యా చూసినా రాష్ట్ర గిరిజన జనాభాలో 37.23 శాతం ఈ ప్రాంతంలోనే ఉంది. 75 ఏళ్ల స్వతంత్ర భారతంలో ఇంకా వీరి జీవన ప్రమాణ స్థాయి, ఆయుష్షు, ఆరోగ్యం ఏవిధంగా వెనుకబడి ఉన్నాయో ఈ పుస్తకం వివరించింది.
అలాగే అభివృద్ధి పేరు చెప్పి, అభివృద్ధి చెందిన దేశాల్లో ఎత్తేసిన కంపెనీలను ఈ ప్రాంతంలో పెట్టడానికి పాలకులు ఎలా ముందుకొస్తున్నారో చర్చించింది ఈ పుస్తకం. ''పట్టణ విస్తీర్ణంలో దేశంలోనే మూడో స్థానంలో ఉన్న విశాఖపట్టణం ఆదాయం ఈ ప్రాంతీయులకే అందుతుందా? నిజంగా విశాఖపట్నం ఉత్తరాంధ్ర వాసుల చేతిలో ఉందా?'' మొదలైన ప్రశ్నలకు ''విశాఖ నగరం-అందరిదీ'' అను వ్యాసంలో సమగ్రంగా చర్చించారు రచయిత.
అయితే నాటి అశోకుని నుండి, నేటి ఆల్ఖైమా కంపెనీ వరకూ ఉత్తరాంధ్రపై వరుస దాడులను చేస్తున్నప్పటికీ ఇక్కడి ప్రజలు మొక్కవోని ధైర్యంతో పోరాటాలు చేస్తూనే ఉన్నారు. స్వతంత్ర భారతంలో ఇక్కడి పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఎన్నుకోబడిన నాయకులు తమ పదవులను కాపాడుకోడానికి ప్రభుత్వాలకు వత్తాసు పలుకుతున్నప్పటికీ, విశాఖ ఉక్కు సాధన ఉద్యమం మొదలుకొని, మొన్నటి సోంపేట పర్యావరణ పరిరక్షణ ఉద్యమం వరకూ ఇక్కడి ప్రజలు మాత్రం పోరాడుతూనే ఉన్నారు. విజయాలు సాధిస్తూనే ఉన్నారనే విషయాన్ని ''ఉద్యమాలే అభివృద్ధికి సోపానాలు'' అనే స్ఫూర్తిదాయక వ్యాసంలో చర్చించారు.
ఈ చిన్న పుస్తకం 112 పుటలతో వర్తమాన ఉత్తరాంధ్ర చరిత్రను, ఉనికిని స్పష్టంగా వివరించింది. ఈ ప్రాంత అస్థిత్వాన్ని తెలుసుకోవాలనుకొనే ప్రతిఒక్కరూ ఈ పుస్తకాన్ని చదివి తీరాలి. ఇంత మంచి పుస్తకాన్ని అందించిన రచయితకు అభినందనలు.
- డా.ఆల్తి మోహనరావు,
9963895636