Jul 05,2023 19:35

ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న సిపిఎం నాయకులు స్వాములు

ఉపాధ్యాయుల సంఖ్యను పెంచాలి

ప్రజాశక్తి - కొత్తపల్లి

కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులకు సరైన విద్య అందడం లేదని, విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఉపాధ్యాయులను ఏర్పాటు చేయాలని సిపిఎం మండల నాయకులు ఎన్‌ స్వాములు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా నాయకులు కే దినేష్‌ కుమార్‌, ఎస్‌ఎఫ్‌ఐ మాజీ నాయకులు బొల్లు ప్రసాద్‌ బాబు యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం నాడు ఎర్రమఠం గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాలను వారు పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కొత్తపల్లి మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులతోనే విద్యను అందించడం జరుగుతోందని అన్నారు. సింగరాజు పల్లె ప్రాథమిక పాఠశాలలో 74 మంది పిల్లలు ఉంటే కేవలం ఇద్దరు టీచర్లు మాత్రమే ఉన్నారని, కొక్కెరంచ ప్రాథమికోన్నత పాఠశాలలో 179 మంది విద్యార్థులు ఉంటే కేవలం ముగ్గురు ఎస్జిటి టీచర్లు మాత్రమే విద్యానందిస్తున్నారని తెలిపారు. ఎర్రమఠం ప్రాథమికోన్నత పాఠశాలలో 105 మంది విద్యార్థులు ఉంటే ముగ్గురు ఎస్జీటీలు, ఎదురుపాడు గ్రామం ప్రాథమికోన్నత పాఠశాలలో 98 మంది విద్యార్థులకు గాను ముగ్గురు టీచర్లు మాత్రమే ఉన్నారన్నారు. ప్రాథమికోన్నత పాఠశాలల్లో సబ్జెక్టుల వారిగా ఒక్కొక్క పాఠశాలకు కనీసం 8 నుంచి 10 మంది ఉపాధ్యాయులు ఉండాల్సిన ఉండగా, సబ్జెక్టు టీచర్లను నియమించకుండా ప్రభుత్వం కేవలం ఇద్దరు ముగ్గురు ఎస్జీటీ టీచర్లతోనే పాఠశాలలను నడిపితే పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య ఏ విధంగా అందుతుందని వారు ప్రశ్నించారు. ఇప్పటికైనా ప్రభుత్వంఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలని వారు డిమాండ్‌ చేశారు.