గుమ్మలక్ష్మీపురం: ఏజెన్సీలో గత రెండురోజులుగా కురుస్తున్న వర్షాలకు జియ్యమ్మవలస మండలం గడసింగిపురం వద్ద గల రాళ్లగెడ్డ ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో సుమారు 15 గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులుపడుతున్నారు. వరి పంట నీట మునగడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కురుస్తున్న వర్షాలకు గత రెండు రోజులుగా గెడ్డ నడుము లోతు వరకు ప్రవహిస్తోందని, దాంతో వాహనాలు నిలిచిపోయి ఉద్యోగులు, వాహనదారులు, విద్యార్థులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనీ కనీసం 108 వాహనం కూడ రాకపోవడంతో అత్యవసర పరిస్థితిల్లో రోగులకు మోసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ సమస్యను పలుమార్లు అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికైనా అధికారులు, పాలకులు స్పందించి రాళ్ల గెడ్డ వద్ద వంతెన నిర్మించాలని కోరుతున్నారు.










