
ప్రజాశక్తి-మండపేట
మున్సిపల్ కాంట్రాక్ట్ పారిశుద్ధ్య కార్మికులకు ఉద్యోగ భద్రత సిఐటియు జిల్లా కార్యదర్శి కె. కృష్ణవేణి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఔట్సోర్సింగ్ కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే నేటికి అది అమలు చేయలేదన్నారు. సమాన పనికి సమాన వేతనం అందించాలన్నారు. కార్మికుల సమస్యలు తక్షణం పరిష్కరించాలన్నారు. అనంతరం మున్సిపల్ ఛైర్పర్సన్ పతివాడ నూక దుర్గ రాణికి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సిఐటియు నాయకులు కోమారపు నరేంద్ర కుమార్, బంగారు కొండ, విజరు, రాజు, అప్పారావు, చిరంజీవి, రమేష్, కార్మికులు పాల్గొన్నారు.
సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి
రామచంద్రపురం రాష్ట్రంలో పురపాలక సంఘాల పరిధిలోని ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ సిఎం జగన్ ఇచ్చిన హామీ ప్రకారం పర్మినెంట్ చేయాలని , సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ శనివారం రామచంద్రాపురం మున్సిపల్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రవ్యాప్త పిలుపులో భాగంగా పురపాలక సంఘం కార్యాలయం వద్ద విధులకు హాజరైన కార్మికులంతా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి నూకల బలరాం, ఎపి మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షులు బాబురావు, మండల నాయకులు నాగభూషణం మాట్లాడుతు ముఖ్యమంత్రి అధికారంలోకి వస్తే మున్సిపల్ ఔట్సోర్సింగ్ కార్మికులను పర్మినెంట్ చేస్తామని హామీ ఇచ్చారన్నారు. అయితే నేడు ఆ హామీ అమలు చేయలేదన్నారు. ఇప్పటికే 11వ పిఆర్సిలో కార్మికులకు జీతం పెంచాల్సినంత పెంచుకుండా, రూ.5వేలు కోత విధించారన్నారు. వచ్చే ఎన్నికల్లో మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించే వారిని కార్మిక వర్గం అంతా బలపరుస్తుందన్నారు. భవిష్యత్తులో చేపట్టే అన్ని కార్యక్రమాల్లో కార్మికులందరూ పాల్గొని జయప్రదం చేస్తామని, ఈ విషయాన్ని ముఖ్యమంత్రి కి సంతకాలతో కూడిన మెయిల్ పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో తాతారావు, సత్యనారాయణ, భీమశంకర్ మున్సిపల్ కార్మికుల పాల్గొన్నారు.