ప్రజాశక్తి - హాలహర్వి
రైతులకు ఉచితంగా పప్పు శనగ విత్తనాలను పంపిణీ చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్షులు వెంకటేశులు డిమాండ్ చేశారు. శుక్రవారం హాలహర్వి ఎఒ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో సరైన వర్షాల్లేక పంటలు ఎండిపోయాయని తెలిపారు. పత్తి, ఉల్లి తదితర పంటలను చెడిపేసి, పప్పు శనగ పంట వేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. పెట్టిన పెట్టుబడీ కాదు కదా కనీసం విత్తనాల ఖర్చు కూడా వచ్చే పరిస్థితి లేదన్నారు. ఎకరాకు రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు ఇవ్వాలని కోరారు. రైతులకు రూ.2 లక్షలు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. ఉపాధి హామీ చట్టం 200 రోజులు కల్పించాలని, ఇన్స్యూరెన్స్ జిఒ 660 రద్దు చేయాలని కోరారు. గ్రామాన్ని యూనిట్ గా తీసుకొని అమలు చేయాలని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఫసల్ బీమాతో సంబంధం లేకుండా అమలు చేయాలని కోరారు. వేదవతి, నగరడోన రిజర్వాయర్లు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఎ, బి, సి కాలువ చివరి ఆయకట్టు వరకు నీరందించాలని కోరారు. రైతు సంఘం మండల అధ్యక్షులు భీమా, రైతు సంఘ కార్యదర్శి కృష్ణ పాల్గొన్నారు.
వినతిపత్రం అందజేస్తున్న నాయకులు










