Jul 16,2023 14:25
  • ట్రస్టు నిధులు దుర్వినియోగం అవుతున్నాయన్న ప్రచారాన్ని నమ్మకండి
  • డయల్ యువర్ ఈవో  టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి

ప్రజాశక్తి-తిరుమల : పురాతన ఆలయాల జీర్ణోద్ధరణ, పునరుద్ధరణకు నిబంధనల ప్రకారం శ్రీవాణి ట్రస్టు ద్వారా ఆర్థిక సాయం అందిస్తామని టీటీడీ ఈవో ఎవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుమల అన్నమయ్య భవనంలో ఆదివారం జరిగిన డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. ఇందులో మంచిర్యాలకు చెందిన శ్రీకాంత్, చెన్నైకి చెందిన  వెంకటేష్ అనే భక్తులు అడిగిన ప్రశ్నలకు ఈవో సమాధానమిస్తూ దాదాపు 9 లక్షల మంది భక్తులు ఇప్పటివరకు శ్రీవాణి ట్రస్టుకు దాదాపు రూ.880 కోట్ల విరాళాలు ఇచ్చినట్టు తెలిపారు. ఈ నిధులతో దాదాపు 2500 ఆలయాల నిర్మాణానికి ఆర్థిక సాయం అందిస్తున్నామన్నారు. ధూపదీప నైవేద్యాల కోసం ప్రతినెలా రూ.5 వేలు అందిస్తున్నట్టు చెప్పారు. శ్రీవాణి ట్రస్టు నిధులు దుర్వినియోగమయ్యాయని ఇటీవల కొంతమంది దుష్ప్రచారం చేశారని, భక్తులు ఇలాంటి ప్రచారాన్ని నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. తిరుపతిలోని మంచినీళ్ల గుంటను అభివృద్ధి చేసి శ్రీ గోవిందరాజ స్వామివారి విగ్రహాన్ని ప్రజలు చూసే అవకాశం కల్పిస్తామన్నారు.