Dec 04,2021 20:02

న్యూఢిల్లీ : ట్విట్టర్‌ కొత్త సెన్సార్‌షిప్‌ విధానానికి ఎదురు దెబ్బ తగిలింది. పెద్ద సంఖ్యలో వినియోగదారులకు వ్యతిరేకంగా ''హానికరమైన, సమన్వయం'' తో కూడిన వార్తలు వచ్చాయని ట్విట్టర్‌ తెలియచేయడంతో వ్యక్తిగత సమాచారంపై రూపొందించిన ఈ కొత్త విధానానికి ఎదురు దెబ్బ తగిలింది. ఈ యూజర్లలో కొందరిని పొరపాటున సస్పెండ్‌ చేయడం కూడా జరిగిందని తెలిపింది. ట్విట్టర్‌ ప్రతినిధి ట్రెంటన్‌ కెన్నెడీ మాట్లాడుతూ, ప్రైవేటు వ్యక్తులను వేధించడానికి లేదా బెదిరించడానికి ఫోటోలను, వీడియోలను ఉపయోగిస్తూ మీడియాను దుర్వినియోగపరచడాన్ని నిషేధించే కొత్త నిబంధన కారణంగా కొన్ని ఖాతాలను పొరపాటున సస్పెండ్‌ చేయడానికి దారి తీసిందని తెలిపినట్లు వాషింగ్టన్‌ పోస్ట్‌ శుక్రవారం రాత్రి పేర్కొంది. ప్రముఖులు కాని వ్యక్తుల ఫోటోలను, వీడియోలను వారి అనుమతి లేకుండా షేర్‌ చేయడాన్ని ఆధునీకరించిన ఈ విధానం నిషేధిస్తోంది. అయితే ఈ నిబంధనకు అనేక మినహాయింపులు వున్నాయి. ప్రజా ప్రయోజనాలతో ఫోటోలు షేర్‌ చేసినా, లేదా ప్రభుత్వ కార్యాచరణకు విలువ జోడించబడినా లేదా ప్రైవేటు వ్యక్తుల లబ్దికి ఉపయోగపడినా ఈ నిబంధన వర్తించదు. స్వతంత్ర మీడియా నోరునొక్కడానికి చేసే ప్రయత్నంగా ఈ విధానానికి విమర్శలు ఎదురయ్యాయి.