తప్పుడు రిఫండ్ క్లైమ్ లు సరి చూసుకోండి
జాయింట్ కమీషనర్ అనీష్ ఖాన్
ప్రజాశక్తి - నంద్యాల కలెక్టరేట్
తప్పుడు రిఫండ్ క్లైమ్ లు సరి చూసుకోవాలని ఆదాయపు పన్ను జాయింట్ కమీషనర్ అనీస్ ఖాన్ ఆడిటర్లకు తెలిపారు.నంద్యాల జిల్లా సంబంధించి గురువారం నంద్యాల ఆదాయపు పన్ను శాఖ కార్యాలయంలో ఆదాయపు పన్ను జాయింట్ కమీషనర్ అనీస్ ఖాన్ ఆడిటర్లు టాక్స్ బార్ అసోసియేషన్ లతో సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదాయపు పన్ను వివరాలు తప్పుగా సమర్పించినా, అర్హత లేని మినహాయింపులు క్లెయిమ్ చేసి రిఫండ్ పొందితే పన్ను చెల్లింపు దారులు తీవ్ర పరిణామాలు ఎదుర్కోవలసి వస్తుందని హెచ్చరించారు. అలాంటి పరిణామాల్లో 12 శాతం వడ్డీ తో పాటు 200 శాతం వరకు అపరాధ రుసుము వసూలు చేయడం తో పాటు రెండేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. గత సంవత్సరం లో నంద్యాల పరిధి లోని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల, ప్రభుత్వ రంగసంస్థలు మరియు సాఫ్ట్ వేర్ ఉద్యోగులు తప్పుడు క్లైమ్ లతో 75-90 శాతం వరకు రిఫండ్ పొందిన ఉదంతాలు బహిర్గతమయినాయి అని తెలిపారు.ఇప్పటికే తప్పుడు క్లైమ్ లు చేసి రిఫండ్ లు పొందిన పన్ను చెల్లింపుదారులు ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 139(8ఏ) ప్రకారం మదింపు సంవత్సరాలు 2021-22, 2022-23కు సవరించిన రిటర్న్ దాఖలు చేసి 1408 సెక్షన్ ప్రకారం పన్ను చెల్లించాలి. 2023-24 కోసం ఇప్పటికే రిటర్న్ లు సమర్పించినవారు 139(5) సెక్షన్ ప్రకారం సవరించిన రిటర్న్ దాఖలు చేయ వచ్చని తెలిపారు. ఈ సమావేశం లో ఆయన తో పాటు ఆదాయపు పన్ను డిప్యూటీ కమీషనర్ రాజా రెడ్డి ఆదాయపు పన్ను అధికారినందవరం శ్రీధర్ రావు , ఇన్స్పెక్టర్ నవకాంత్ , టాక్స్ బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సి వి రెడ్డి , ఛార్టర్డ్ అకౌంటెంట్లు మాఘం పుల్లయ్య , పాలూరు గోపి కృష్ణ , మాఘం సురేష్ , వంకదార భరత్ కుమార్ ఆడిటర్లు జయ గోపాల్ , వంకర గోపాల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.










