Nov 13,2023 22:22


ప్రజాశక్తి- కుప్పం
తిరుమల తిరుపతి దేవస్థానం నందు క్షౌర వృత్తిదారులను కేఓడి పేరుతో విధుల నుండి తీసివేయడం దారుణమని తెలుగుదేశం పార్టీ నాయి బ్రాహ్మణ విభాగం రాష్ట్ర కన్వీనియర్‌ శాంతారామ్‌ పత్రికా ప్రకటన ద్వారా తెలియజేశారు. వాటి పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా తిరుమల తిరుపతి దేవస్థానం నందు కళ్యాణకట్టలో విధులు నిర్వహిస్తున్న 859 మంది నాయి బ్రాహ్మణులను శాశ్వత ఉద్యోగులుగా చేస్తామని హామీ ఇచ్చి, నాయి బ్రాహ్మణులను మోసగించారని అన్నారు. ముఖ్యంగా వైసిపి అధికారం చేపట్టిన తరువాత టిటిడి కళ్యాణ కట్ట నందు 49 మందిని విధుల నుండి బహిష్కరించడం దారుణం అన్నారు. ఎన్నికలకు ముందు ఉద్యోగులను శాశ్వత ఉద్యోగులుగా పరిగణిస్తామని చెప్పిన ముఖ్యమంత్రి నేడు ప్రైవేటు ఏజెన్సీ కింద విధులు నిర్వహించాలని అనడం దారుణమన్నారు. అలాగే ఇప్పటివరకు ఏడు మందిని విధుల నుండి శాశ్వతంగా తొలగించడమే కాకుండా 49 మంది పై కే ఓ డి విధానాన్ని పెట్టడం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విధుల నుండి తొలగించిన ప్రతి ఒక్కరిని వెంటనే విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్‌ చేశారు. అలా జరగని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా నాయి బ్రాహ్మణ కులస్తులు ఏకమై టిటిడి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు.