తెలుగు సంస్కృతిని భావితరాలకు అందించాలి : కలెక్టర్
ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా)
సంస్కృతీ సంప్రదాయాలు కాపాడుకుంటూ భావితరాలకు అందించాలని కలెక్టర్ రంజిత్ బాషా సూచించారు. జిల్లా యంత్రాంగం దేవాదాయశాఖ సంయుక్త ఆధ్వర్యలో బుధవారం స్థానిక బచ్చుపే పేట వెంకటేశ్వరస్వామి వారి దేవస్థాన కళ్యాణ మండపంలో ఉగాది వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా కలెక్టర్ పి. రంజిత్ బాషా, జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్, నగర మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, ముడా ఛైర్ పర్సన్. నాగ వెంకట దుర్గాభవాని ముఖ్య అతిథులుగా హాజరై ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. వేదపండితులను, అర్చక స్వాములను, కవులను ఘనంగా సత్కరించారు. వేద పండితులు ఆశీర్వచనం పలికారు.
తొలుత కలెక్టర్ ఆహుతులు జ్యోతి ప్రజ్వలన చేశారు. విష్ణుభొట్ల నాగవెంకట నారాయణశర్మ ఆవధాని, షణ్ముఖ విశ్వనాధశర్మ అవధాని వేద పఠనం చేశారు. విష్ణు భొట్ల సూర్యనారాయణ శర్మ ఘనాపాటి పంచాంగ శ్రవణం చేశారు. దేవదాయశాఖ ఆధ్వర్యంలో వివిధ దేవాలయాల్లో నిష్టాతులైన అర్చక స్వాములను, వేద పండితులను ఘనంగా సత్కరించారు. డిఆర్వో ఎం.వెంకటేశ్వర్లు, జిల్లా దేవదాయ అధికారి హరనాథబాబు, బందరు ఆర్డిఒ ఐ.కిషోర్ వేడుకలను పర్యవేక్షించారు. తొలుత కలెక్టర్, జాయింట్ కలెక్టర్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. డిటిడబ్లూఒ ఫణి ధూర్జటి స్వాగతం పాత్రికేయులు ముదిగొండ శాస్త్రి వ్యాఖ్యానం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ గాజుల శ్రీదేవి, మున్సిపల్ కమిషనర్ చంద్రయ్య, జిల్లా రవాణా అధికారి సీతాపతిరావు, తహశీల్దార్ డి.సునీల్బాబు, వివిధ దేవాలయాల ఈవోలు పాల్గొన్నారు.










