ప్రజాశక్తి-కలక్టరేట్ (కృష్ణా) : ఈనెల 15 న భారతదేశ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ పి. రాజాబాబు జిల్లా అధికారులను ఆదేశించారు.జిల్లా కలెక్టర్ మంగళవారం కలెక్టరేట్లో జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించి స్వాతంత్ర దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఈనెల 15న స్థానిక పోలీస్ పెరేడ్ గ్రౌండ్లో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నిర్వహించుటకు పోలీస్ మైదానం సిద్ధం చేయాలని, అవసరమైన పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేయాలని పోలీసు అధికారులకు సూచించారు. జిల్లా ఇన్చార్జ్ మంత్రి జాతీయ జెండా ఎగురవేస్తారని, అందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. వేడుకల నిర్వహణకు వేదిక సిద్ధం చేయాలని, తగిన విధంగా అలంకరించాలని, సీటింగ్ ఏర్పాట్లు, విఐపి లకు ప్రత్యేక సీటింగ్ ఏర్పాట్లు చేయాలని శానిటేషన్, తాగునీటి సరఫరా, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆర్ అండ్ బి, రెవిన్యూ, మున్సిపల్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ అపరాజిత సింగ్, ఏఎస్పి శ్రీహరి బాబు, డిఆర్వో ఎం వెంకటేశ్వర్లు, ఏఆర్ఏఎస్పి ఎస్ వి డి ప్రసాద్, డియం అండ్ హెచ్ ఓ డాక్టర్ గీతాబాయి, డీఈవో తహెరా సుల్తానా, డ్వామా పీడీ జీవి సూర్యనారాయణ పాల్గొన్నారు.










