
స్వామిత్వా పనులను వేగవంతం చేయాలి : జెసి
ప్రజాశక్తి- చిత్తూరుఅర్బన్: క్షేత్రస్థాయిలో జరుగుతున్న మూడో విడత రీసర్వే పనులను వేగవంతం చేసి వారం లోపల విలేజ్ సర్వేయర్ లాగిన్ లో అప్లోడ్ చేయాలని, స్వామిత్వ పనులు వేగవంతం చేయాలని జాయింట్ కలెక్టర్ పి.శ్రీనివాసులు అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా రెవెన్యూ అధికారి, ఆర్డీవోలు, తహసిల్దార్లు, ఎంపీడీవోలు, డిఐలు, సర్వే డీటీలతో జెసి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జెసి మాట్లాడుతూ ఈనెల 16వ తేదీ లోపల మూడో విడత రీసర్వే పనులు నిర్వహిస్తున్న 106 గ్రామాలకు సంబంధించి క్షేత్రస్థాయిలో గ్రౌండ్ ట్రూతింగ్, విలేజ్ సర్వేయర్ లెవల్లో లాగిన్ పూర్తిచేయాలని ఆదేశించారు. అదేవిధంగా రెండు విడతలకు సంబంధించి ఇంకా పెండింగ్ పనులు ఏవైనా ఉంటే వాటిని వేగవంతం చేసి రెండు విడతల్లోనూ వచ్చిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి పరిష్కరించాలని అన్నారు. నిర్దేశిత లక్ష్యాలను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేయాలని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆలస్యం చేయకూడదని అన్నారు. జిల్లాకు సంబంధించి 126 గ్రామాలకు ఓఆర్ఐలు రావడం జరిగిందని స్వామిత్వా సర్వే పనులు వేగవంతం చేయాలన్నారు. డిపిఓ లక్ష్మీ, ఏడి సర్వే ల్యాండ్ రికాడ్స్ గౌస్ బాష పాల్గొన్నారు.