ప్రజాశక్తి-కలెక్టరేట్ (కృష్ణా) : 'స్పందన', 'జగనన్నకు చెబుదాం' లాగిన్ కు వచ్చే అర్జీలు సమగ్రంగా పరిశీలించి, అర్జీదారుల సంతృప్తే ధ్యేయంగా అధికారులు కృషి చేయాలని కృష్ణాజిల్లా కలెక్టర్ పి.రంజిత్ బాషా సూచించారు. సోమవారం కలెక్టరేట్ లో నిర్వహించిన స్పందన సమావేశంలో పాల్గొన్నారు. జాయింట్ కలెక్టర్ డా. అపరాజిత సింగ్, డిఆర్వో ఎం. వెంకటేశ్వర్లు కలసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో వివిధ శాఖలకు సంబంధించి రీఓపెన్ కేసులు 25 వరకు వచ్చాయని, వీటిని తగ్గించాల్సిన అవసరం ఉందని అన్నారు. స్పందనలో మరియు జగనన్నకు చెబుదాం లాగిన్ వచ్చే అర్జీలు సమగ్రంగా పరిశీలించి, అర్జీదారులకు సంతప్తి కరంగా పరిష్కరించినప్పుడు రీఓపెనక్కు అవకాశం ఉండదని ఆ విధంగా పరిష్కరించాలని సూచిం చారు. జగనన్నకు చెబుదాం లాగిన్ లో 55 పెండింగ్ ఉన్నాయని, అర్జీల వారీగా, శాఖల వారీగా కలెక్టర్ సమీక్షించారు. పెండింగ్ సత్వరమే పరిష్కరించాలన్నారు.










