
ప్రజాశక్తి - ఏలూరు
జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో అందిన అర్జీదారులకు సంతృప్తికరమైన పరిష్కారాలు చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ బి.లావణ్యవేణి చెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో జరిగిన జిల్లాస్థాయి జగనన్నకు చెబుదాం స్పందన కార్యక్రమంలో జెసి లావణ్యవేణి, డిఆర్ఒ ఎం.వెంకటేశ్వర్లు, ఏలూరు ఆర్డిఒ ఎన్ఎస్కె.ఖాజావలి, డిప్యూటీ కలెక్టర్ సత్యనారా యణ, జిల్లా వ్యవసాయశాఖ జెడి రామకృష్ణ, డిప్యూటీ కలెక్టర్ భానుశ్రీతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ప్రజల వినతులను సావదానంగా విని అర్జీలను సత్వరం పరిష్కరించాలని ఆయాశాఖల అధికారులకు జెసి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజలసంక్షేమం కోసం అమలు చేస్తున్న వివిధ సంక్షేమ పధకాలు రెవెన్యూ, పౌర సరఫరాల సేవలు, నవరత్నాలు, పేదలందరికి ఇళ్లు, ఇళ్ల మంజూరు, పెన్షన్లు, సర్వే, భూ వివాదాలు తదితర సమస్యలకు సంబంధించి మొత్తం 253 అర్జీలు వచ్చాయని ఆమె తెలిపారు. ఒకే అంశంపై మళ్లీ మళ్లీ అర్జీలు నమోదు కాకుండా అధికారులు దృష్టిపెట్టి వినతులను పరిశీలించి న్యాయమైన పరిష్కారం ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, కలెక్టరేట్ సిబ్బంది పాల్గొన్నారు.